నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన ఒక సభలో ట్రంప్ ప్రసంగించారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో మోసం చేసేందుకే ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ ఐడీని జాత్యహంకారంతో ముడిపెట్టడం సరికాదని, 95 శాతం మంది ప్రజలు ఈ నిబంధనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా, పోస్టల్ బ్యాలెట్ (మెయిల్-ఇన్ బ్యాలెట్) విధానంపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. కేవలం సైనికులు, అనారోగ్యంతో ఉన్నవారు, విహారయాత్రలకు వెళ్లిన వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని సూచించారు. అయితే, ఓటర్ ఐడీ నిబంధనపై అమెరికాలో భిన్న వాదనలు ఉన్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం దాదాపు 80-85 శాతం మంది ఈ నిబంధనను సమర్థిస్తున్నారు. మరోవైపు, దేశంలోని సుమారు 11 శాతం మంది అర్హులైన పౌరుల వద్ద (సుమారు 2.1 కోట్లు) ప్రభుత్వ ఫోటో ఐడీలు లేవని పౌర హక్కుల సంఘాలు చెబుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లు అధికంగా ఉండటంతో, ఈ నిబంధన వివక్షకు దారితీస్తుందని డెమోక్రాట్లు, పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాల వివాదంతో జార్జియా రాజకీయ కేంద్రంగా మారిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



