ప్రజలకు అవగాహన కల్పించిన వార్డ్ మెంబర్ బొడ్డు సునీత
నవతెలంగాణ – కాటారం
కాటారం మూడో వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలను మూడో వార్డ్ మెంబర్ బొడ్డు సునీత శనివారం పర్యవేక్షించారు. పరిశుభ్ర కార్మికులతో కలిసి మూడో వార్డులోని మోరీలను శుభ్రపరిచి, చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే, వార్డులో త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు మోరీల్లో చెత్త వేయకుండా, చెత్తను ఒకచోట కుప్పలుగా వేసి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని బొడ్డు సునీత కోరారు.
మోరీల్లో చెత్త వేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని నీరు నిలిచిపోవడం, దోమల బెడద పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రతకు బాధ్యత వహించి, తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశుభ్ర కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



