– అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధే లక్ష్యం
– దానికోసమే ‘క్యూర్ – ప్యూర్ – రేర్’ : ‘గ్రోత్ ఎక్స్- 2026” సదస్సులో మంత్రి శ్రీధర్బాబు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తూ, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దీనికోసం త్వరలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0ను తెస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్-2026’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి యాధృచ్ఛికంగా వచ్చేది కాదనీ, భావితరాల భవిష్యత్ కోసం శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ను రూపొందించిందన్నారు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణను, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధన కోసమే ‘క్యూర్ – ప్యూర్ – రేర్’ అనే త్రిముఖ వ్యూహానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నామన్నారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. పరిశ్రమలకు కేవలం అనుమతులు ఇచ్చే వ్యవస్థలా కాకుండా, వారితో కలిసి నడిచే భాగస్వామిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్ రవికుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్-2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో రెండోవిడత ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



