Sunday, June 28, 2026
E-PAPER
Homeసోపతికాశ్మీర్‌ యాత్రా శోభ

కాశ్మీర్‌ యాత్రా శోభ

- Advertisement -

కాశ్మీర్‌ను చాలామంది భూతల స్వర్గం అంటారు. కానీ అక్కడ ఐదు రోజులు గడిపిన తర్వాత నాకు అనిపించింది, అది కేవలం ఒక ప్రదేశం కాదు.. ప్రకతి తన మౌన భాషలో మనిషితో సంభాషించే ఒక అపూర్వ అనుభవం. భూతల స్వర్గంగా పేరొందిన కాశ్మీర్‌ లోయలో గడిపిన ఆ ఐదు రోజులు కేవలం ఒక పర్యాటక యాత్ర మాత్రమే కాదు.. ప్రకతి మాత ఒడిలో సాగిన ఒక అందమైన అనుభవం. సోన్‌మార్గ్‌, గుల్‌మార్గ్‌, పహల్గామ్‌, శ్రీనగర్‌.. ఈ నాలుగు అద్భుత ప్రదేశాలు నా మనోఫలకంపై చెరగని ముద్రలు వేశాయి.

సోన్‌మార్గ్‌: బంగారు పచ్చిక బయళ్ల స్వర్గం(Meadow of Gold)

శ్రీనగర్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోన్‌మార్గ్‌తో మా యాత్ర ప్రారంభమైంది. హిమాలయ పర్వత శ్రేణుల మధ్యగా సింధ్‌ నది ప్రవహిస్తుంటే, చుట్టూ మంచుతో అలంకరించుకున్న శిఖరాలు సందర్శకులను ఆహ్వానిస్తాయి. ఇక్కడి ప్రజలు కొండ వాలుల్లో, నది ఒడ్డున చిన్నచిన్న పొలాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తారు. పర్యాటకులను గుర్రాలపై గ్లేసియర్‌ ప్రాంతాలకు తీసుకెళ్లడం కూడా వారి ముఖ్య జీవనాధారాలలో ఒకటి. థాజివాస్‌ గ్లేసియర్‌ వైపు ప్రయాణం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. మేము వాహనంలో ప్రయాణించినప్పటికీ, చాలామంది గుర్రపు స్వారీని ఆస్వాదిస్తుంటారు. అయితే ఒక ముఖ్యమైన సూచన, గ్లేసియర్‌ ప్రాంతానికి చేరువయ్యే కొద్దీ ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. చలి తీవ్రంగా ఉంటుంది. కాబట్టి స్థానికులు అందించే జాకెట్లు, గమ్‌బూట్లు తప్పనిసరిగా ధరించడం మంచిది. శ్వాసకోశ సమస్యలు, మోకాళ్ల నొప్పులు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. ఆ రోజు సాయంత్రం తిరిగి శ్రీనగర్‌ చేరుకుని బస చేశాము.

గుల్‌మార్గ్‌ : పూల వనం, మంచు సామ్రాజ్యం(Meadow of Flowers) :
రెండవ రోజు శ్రీనగర్‌ నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని గుల్‌మార్గ్‌ చేరుకున్నాం. ప్రపంచ ప్రఖ్యాత గొండోలా కేబుల్‌ కార్‌ ప్రయాణం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అఫర్వత్‌ శిఖరం వైపు కేబుల్‌ కార్‌లో ప్రయాణిస్తుంటే, దిగువన విస్తరించిన దేవదారు అడవులు, దూరంగా మెరిసే మంచు శిఖరాలు కళ్లకు విందుగా నిలుస్తాయి. గుల్‌మార్గ్‌లో విస్తారమైన పచ్చిక బయళ్లు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గోల్ఫ్‌ కోర్సుల్లో ఒకటి కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో పర్యాటకులతో చిన్న చిన్న వీడియోలు, రీల్స్‌ రూపొందించి వెంటనే అందించే స్థానిక ఫొటోగ్రాఫర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారారు. చాలామంది పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రానికే తిరిగి వెళ్తారు. అయితే గుల్‌మార్గ్‌లో కనీసం ఒక రాత్రి బస చేస్తే ఉదయపు మేఘాలు, నిశ్శబ్దం, ప్రకతి సోయగాలు కాశ్మీర్‌ను ఎందుకు ‘భూతల స్వర్గం’ అంటారో మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

పహల్గామ్‌ : గొర్రెల కాపరుల లోయ(Valley of Shepherds) : మూడవ రోజు గుల్‌మార్గ్‌ నుండి నేరుగా పహల్గామ్‌కు ప్రయాణమయ్యాము. ఈ మార్గం సమయాన్ని ఆదా చేస్తుంది. పహల్గామ్‌లో లిడ్డర్‌ నది గులకరాళ్ల మధ్య గలగల ప్రవహిస్తూ ప్రకృతి సంగీతాన్ని వినిపిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు, పచ్చని లోయలు మనసును పరవశింపజేస్తాయి. బేతాబ్‌ వ్యాలీ, అరు వ్యాలీ ప్రాంతాలు ప్రకృతి ప్రేమికులకు నిజమైన వరాలు. ఇక్కడి నిశ్శబ్దం, స్వచ్ఛమైన గాలి, పర్వతాల మధ్య విస్తరించిన పచ్చదనం కాలాన్ని నిలిపివేసినట్లే అనిపిస్తాయి. పహల్గామ్‌లో కూడా ఒక రాత్రి బస చేయడం తప్పనిసరిగా సిఫారసు చేయదగిన విషయం. రాత్రివేళల ప్రశాంతత, గొర్రెల కాపరుల సరళ జీవనశైలి నగర జీవితపు హడావుడిని మరిపిస్తుంది.

శ్రీనగర్‌: దాల్‌ సరస్సు, మొఘల్‌ వైభవం : నాలుగవ రోజు పహల్గామ్‌ నుండి శ్రీనగర్‌ చేరుకున్నాం. కాశ్మీర్‌ గుండెగా పేరొందిన శ్రీనగర్‌ సౌందర్యం అనిర్వచనీయమైనది. దాల్‌ సరస్సులో శికారా పడవలో ప్రయాణిస్తూ తేలియాడే తోటలు, హౌస్‌బోట్లు, సరస్సు నీటిలో ప్రతిబింబించే పర్వతాలు చూసే అనుభవం మరపురానిది. మేము ఒక సాంప్రదాయ హౌస్‌బోట్‌లో బస చేశాం. ఆ అనుభవం కాశ్మీర్‌ సంస్కతిని మరింత దగ్గరగా పరిచయం చేసింది. శ్రీనగర్‌ సందర్శనలో నిషాత్‌ బాగ్‌, శాలిమార్‌ బాగ్‌ వంటి ప్రసిద్ధ మొఘల్‌ ఉద్యానవనాలు తప్పక చూడదగినవి. చరిత్ర, ఉద్యానకళ, ప్రకృతి.. ఈ మూడు అక్కడ అద్భుతంగా కలిసిపోతాయి. ఐదవ రోజు శ్రీనగర్‌లోని ప్రాచీన శంకరాచార్య ఆలయాన్ని దర్శించాం. కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అక్కడి నుండి కనిపించే శ్రీనగర్‌ నగరం, దాల్‌ సరస్సు దశ్యం అద్భుతంగా ఉంటుంది.

ప్రయాణికులకు సూచన:
శికారా ప్రయాణానికి ముందుగా ధరను స్పష్టంగా నిర్ణయించుకోవడం మంచిది. పర్యాటక సీజన్‌లో ధరలు వ్యక్తికి వ్యక్తికి మారవచ్చు.
చివరగా: ఈ ఐదు రోజుల యాత్ర నాకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేసింది. మనిషి నిర్మించిన కాంక్రీట్‌ ప్రపంచం ఎంత వైభవంగా కనిపించినా, ప్రకతి ప్రసాదించిన ప్రశాంతతకు అది సాటిరాదు. సరైన ప్రణాళికతో, ఆరోగ్య జాగ్రత్తలతో, కనీసం ఐదు రోజుల సమయం కేటాయించి కాశ్మీర్‌ను సందర్శిస్తే, అది కేవలం ఒక పర్యటనగా కాక, మనసును నిశ్శబ్దంగా మార్చే ఒక అనుభవంగా మిగులుతుంది. కాశ్మీర్‌ నాకు కనిపించింది ఒక లోయగా కాదు; ప్రకతి తన సౌందర్యాన్ని, తన మౌనాన్ని, తన అనంతత్వాన్ని మనిషికి గుర్తుచేసే ఒక అందమైన కవితగా.

– డా. మునగా రామమోహన రావు, 9840091400

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -