నవతెలంగాణ-హైదరాబాద్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ జాతి విధ్వంసక దాడులకు పాల్పడుతున్న సమయంలో ప్రధాని మోడీ పర్యటన చేపట్టడాన్ని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో బుధవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పర్యటనతో బిజెపి ప్రభుత్వం పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయిల్ పక్షానికి తన సిగ్గులేని నిబద్ధతను మరోసారి బహిరంగంగా వెల్లడించిందని పొలిట్బ్యూరో విమర్శించింది.
కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, ఇజ్రాయిల్ యథేచ్చగా ఉల్లంఘలకు పాల్పడుతూ, దాడులను చేపడుతూ అనేకమంది పాలస్తీనియన్లను హత్య చేస్తున్న సమయంలో ప్రధాని పర్యటన చేపట్టడాన్ని పొలిట్బ్యూరో వ్యతిరేకించింది. ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోనూ పాలస్తీనియన్లపై దాడులు పెరిగాయని, అక్రమ స్థావరాలు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించింది. ప్రధాని మోడీ పర్యటన పాలస్తీనియా లక్ష్యానికి ద్రోహం చేయడమే కాకుండా హత్యాకాండకు పాల్పడిన నెతన్యాహూ పాలనను చట్టబద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా మద్దతుతో ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయిల్ ప్రభుత్వంతో వ్యూహాత్మక, సైనిక మరియు ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం ఈ ప్రకటన ప్రకటిత ఉద్దేశ్యంగా తెలుస్తోందని పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రోద్బలంతో అమెరికా ఇరాన్పై సైనిక దాడికి సిద్ధమవుతున్న సమయంలో ఈ పర్యటన చేపట్టడం అసమంజసమని పొలిట్బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది.



