Wednesday, July 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలువచ్చే 6 నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం..

వచ్చే 6 నెలల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : దాదాపు పదేళ్లుగా న్యాయం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఉన్న అన్ని రకాల న్యాయపరమైన చిక్కులను వేగంగా పరిష్కరించి, వచ్చే ఆరు నెలల వ్యవధిలోనే ఆస్తుల వేలం ద్వారా బాధితులకు డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన కార్యాచరణను చేపడుతున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం అధికారికంగా ప్రకటించింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేయడంతో పాటు, ప్రతి 15 రోజులకోసారి మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని నిరంతరం సమీక్షించాలని నిర్ణయించింది.

సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్‌గా హాజరయ్యారు. అగ్రిగోల్డ్ కేసుల ప్రస్తుత స్థితిగతులు, ఆస్తుల గుర్తింపు, వేలం ప్రక్రియ, డిపాజిటర్ల క్లెయిమ్‌లపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ‘ప్రత్యేక కోర్టు’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -