నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబయి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్వేపైకి ఎయిర్ ఇండియా , ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిరిండియా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ రన్వేపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో అదే రన్వే నుంచి టేకాఫ్ అవ్వడానికి ఎయిర్ ఇండియా విమానం ఎదురుగా వచ్చింది.
ఇది గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎయిర్ ఇండియా విమాన పైలట్ను అప్రమత్తం చేయడంతో వెంటనే విమానాన్ని ఆపివేశారు. రెండు విమానాలు అడుగుల దూరంలో ఎదురెదురుగా ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. రెండు విమానాలలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమానం ముంబయి నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సిలిగుడి నుంచి ముంబయికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షలు నిర్వహించడానికి ఎయిరిండియా విమానాన్ని బేస్కు తరలించామని.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.



