నవతెలంగాణ-హైదరాబాద్: బద్రీనాథ్ ఆలయ విరాళాల అవకతవకలపై శ్రీ బద్రీనాథ్ – కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు కమిటీ విచారణను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే శ్రీ బద్రీనాథ్ – కేదార్నాథ్ టెంపులు కమిటీ ఓ సిబ్బందిపై వేటు వేసింది. విరాళాలు చోరీ చేశాడన్న ఆరోపణల కారణంగా అతడిని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
దీనిపై బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేది స్పందిస్తూ.. ‘ప్రైవేట్ సెక్రటరీగా పని చేసే ప్రమోద్ నౌతియాల్ను విధుల నుంచి సస్పెండ్ చేశాం. ప్రాథమిక దర్యాప్తులో విరాళాల విషయంలో అతడు అవకతవకలకు పాల్పడినట్లు తెలిసింది’ అని పేర్కొన్నారు. ఇక, సస్పెండ్ అయిన ప్రమోద్ నౌతియాల్పై మంగళవారం రాత్రి బద్రీనాథ్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ ఎఫ్ఐఆర్ నమోదైంది. బద్రీనాథ్ ఆలయ విరాళాలు, కానుకల లెక్కింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఈ కమిటీని ఆదేశించారు.



