నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ప్రస్తుతం ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూరి వెంకట్ లకు ఈ హోదాను కల్పిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరికి నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
పార్టీకి వారు చేసిన సేవలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బల్మూరి వెంకట్, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన పలు పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఆయన పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు.



