– నేడు సీపీఐ ఆఫీస్కు మాజీ మావోయిస్టుల బృందం రాక
– కాంగ్రెస్ వైఖరి మారకపోతే పొత్తుకు దూరమవుతాం
– పార్టీ ఫిరాయింపులకు మేం వ్యతిరేకం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ఈ నెల 24న చలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. హైదరాబాద్లోని తమ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఇటీవల లొంగిపోయిన మావోయిస్టుల బృందం గురువారం ఉదయం 10 :30 గంటలకు రానున్నదని వెల్లడించారు. సమసమాజం కోసం కలిసి పనిచేసే అంశంపై చర్చిస్తామని తెలిపారు. వారు తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని మరోమారు చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మాన్ని పాటించడం లేదని విమర్శించారు. తమ పార్టీని, నేతలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవమానించడాన్ని తప్పుబట్టారు. ఒకటెండ్రు జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించారని వివరించారు. సీపీఐ బలం ఎక్కడ ఉందని ఎద్దేవా చేస్తే…మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఎంటో చూపామన్నారు. మిత్ర ధర్మం విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోకపోతే పొత్తును తెంచుకుంటామని స్పష్టం చేశారు. కొత్తగూడెం ఎపిసోడ్తో సీపీఐ-కాంగ్రెస్ మధ్య గ్యాప్ వచ్చిందనీ, ఈ విషయంలో రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారని తెలిపారు. భవిష్యత్తులో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మిత్ర ధర్మాన్ని పాటించే అంశంపై చర్చించడానికి త్వరలోనే సీఎం రేవంత్రెడ్డిని కలుస్తామని చెప్పారు. కమ్యూనిస్టులకు దూరమైతే కాంగ్రెస్కే నష్టమన్నారు. పొత్తు లేకున్నా మొన్న వంద పంచాయతీలు గెలిచామనీ, కాంగ్రెస్తోనే పొత్తు ఉంటే మరో 60 స్థానాలు అదనంగా గెలిచేవాళ్లమని తెలిపారు.
రైతు బంధు వేస్తారా? లేదా? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెంటనే పోయేలా ఫిరాయింపుల చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తాము ప్రశ్నించలేమన్నారు. సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి సింగరేణి సంస్థ కూరుకుపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఈ నెల 18 నుంచి కోల్బెల్ట్ ఏరియాలో బస్సు జాతాను నిర్వహిస్తామనీ, మార్చి 30న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టిడిస్తామని ప్రకటించారు. విదేశాంగ విధానంలో మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మోడీ పాలనలో చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతోనూ వైరం నెలకొందనీ, ఒక్క దేశం కూడా మనకు సహకరించే పరిస్థితి లేదని విమర్శించారు. ఒక నెల పాటు రష్యా నుంచి మన దేశం చమురు కొనుగోలు చేసుకోవడానికి అమెరికా అనుమతి ఇవ్వడమేంటి? మన దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా ముందు తాకట్టు పెట్టడమేంటి? 140 కోట్ల మందికి ప్రతినిధి అయిన మోడీని పట్టుకుని అమెరికా ప్రజాప్రతినిధులు జోకర్గా అభివర్ణిస్తుంటే చూస్తూ ఊరుకోవడమేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికాలు యుద్ధాన్ని ఆపాలనే ప్రకటనను మోడీ చేయాలని కోరారు. ఈనెల 16న కేంద్రం వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నట్టు ప్రకటించారు. సీపీఐ(ఎం) నేత తమ్మినేని వీరభద్రం నిఖార్సయిన కమ్యూనిస్టు అనీ, దాన్ని ఎవ్వరూ కాదనలేరని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూనంనేని సాంబశివరావు సమాధానం ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్గత చర్చలుంటాయనీ, నేతల మధ్య భిన్నాభిప్రాయా లుంటాయని తెలిపారు. ఎవరైనా తప్పు చేస్తే పార్టీలోనే చర్యలుంటాయనీ, అది పార్టీ నిర్మాణంలో అంతర్భాగమని చెప్పారు. తమ పార్టీలోనూ నేతల మధ్య అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారనీ, అంత మాత్రాన వారి మధ్య విభేదాలున్నట్టేనా? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు దళిత నేతలను రాష్ట్ర కార్యదర్శిగా చేయకుంటే చేయట్లేదని ప్రచారం చేసేదీ మీరే…చేస్తే దళితున్ని ముందు పెట్టి నడుపుతున్నారని విమర్శ చేసేదీ మీరే.. అంతా మీడియా ఇష్టమేనా? అంటూ కొట్టి పడేశారు. తమ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా దళితుడేననీ, ఆయన్ను ఎవరు నడిపిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు.
సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ.నరసింహా, కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, బాల నర్సింహ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం 24న చలో అసెంబ్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



