నవతెలంగాణ-హైదరాబాద్ : కాకినాడ జిల్లా తునిలో గురువారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన కారణంగా అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం-విజయవాడ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్యాసింజర్ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ గూడ్స్ రైలు, తుని పట్టణం దాటిన తర్వాత లూప్ లైన్లోకి ప్రవేశిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలులోని ఒక బోగీ అదుపుతప్పి పట్టాల నుంచి పక్కకు ఒరిగింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాద ప్రభావంతో విశాఖపట్నం-మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్, విశాఖ-సికింద్రాబాద్ గరీబ్ రథ్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్తో పాటు పలు ఇతర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.



