ఆ కమిటీ సమీక్షించకుండా అధ్యాయాన్ని ప్రచురించొద్దు
ఎన్సీఈఆర్టీ పుస్తక వివాదంపై సుప్రీం ఆదేశాలు
కేంద్రం వివరణపై సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ : కేవలం 8వ తరగతి కాకుండా అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాలని ఎన్సీఈఆర్టీని ఆదేశించామన్న కేంద్రం వివరణపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠ్యపుస్తకాలను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వుండాల్సిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. పాఠ్య పుస్తకాలను సమీక్షించాలని ఎన్సిఇఆర్టిని ఆదేశించడానికి బదులుగా నిపుణుల కమిటీని నియమించే వుండాల్సిందని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే శీర్షికతో ఎనిమిదో తరగతి సాంఘికశాస్త్రంలో ఒక అధ్యాయాన్ని ముద్రించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది.
సవరించిన అధ్యాయం తిరిగి రాయబడిందని ఎన్సిఇఆర్టి తన అఫిడవిట్లో పేర్కొనడం పట్ల బెంచ్ స్పందిస్తూ, ఆ అధ్యాయాన్ని ఎవరు రాశారని ప్రశ్నించింది. ఫ్యాకల్టీ సభ్యుల్లో తమకు నిపుణులు వున్నారని, వారు రాశారని చెబుతున్నారు, అంటే ఇది ఇప్పటికే పూర్తయింది, కానీ ఆ సవరించిన అధ్యాయాన్ని నిపుణుల కమిటీ సమీక్షించనిదే దాన్ని ప్రచురించవద్దని కోర్టు ఆదేశించింది. ‘అసలు మీరు చెబుతున్న నిపుణులు ఎవరు? ఆ అధ్యాయాన్ని ఎవరు, ఎలా రూపొందించారు? మేం ఇంతలా ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత కూడా ఎన్సిఇఆర్టి డైరెక్టర్ ఇంత సంక్షిప్త ప్రకటనతో ఇలా కోర్టు ముందుకు వచ్చిన పద్ధతి సరైనదేనా?’ అని జస్టిస్ జోమాల్యా బాగ్చి ప్రశ్నించారు. మాజీ సీనియర్ న్యాయమూర్తి, ప్రముఖ విద్యావేత్త, లీగల్ ప్రాక్టిషనర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారితో ఈ సమీక్ష జరపాల్సిందిగా కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.
ముందు నిపుణుల కమిటీ వేయండి
- Advertisement -
- Advertisement -



