పెట్టుబడి తక్కువ..ఆదాయం ఎక్కువ
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం సబ్డివిజన్ లోని మల్హర్, మహాదేవపూర్, మహముత్తరాం, పలిమేల, కాటారం మండలాల్లో సాంప్రదాయ పంటలైన వరి, పత్తి,మొక్క జొన్న సాగు చేసి రైతులకు దిగుబడులు రాక నష్టపోతున్న పరిస్థితి. దీంతో రైతులు ఇప్పుడిప్పుడే కూరగాయల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, తెగుళ్ల దాడి కారణంగా వాణిజ్య పంటలు నష్టాలు మిగిలి స్తుండగా చిక్కుడు, టమాట, వంకాయ, మిర్చితోపాటు పాలకూర,తోటకూర, చుక్కకూర వంటి ఆకుకూరల సాగు మాత్రం సిరులు కురిపి స్తోందని మండలంలోని కొండంపేట,కుంభంపల్లి రైతులు పేర్కొంటున్నారు.
సీజన్తో సంబంధం లేకుండా..
ప్రస్తుతం సీజన్తో సంబంధం లేకుండా గ్రామాలు, పట్టణాల్లో కూరగాయల వినియోగం అధికంగా పెరిగింది. దీంతో రైతులు సీజన్ కు అనుగుణంగా తక్కువ కాలంలో చేతికందే హైబ్రిడ్ రకాలను ఎంపిక చేసుకుని సాగు చేస్తున్నారు. కూలీలపై ఆధార పడకుండా కుటుంబ సభ్యులే పనుల్లో భాగస్వాములు అవుతున్నారు. పెద్దపల్లి,మంథని, భూపాలపల్లి మార్కెట్లకు విక్రయిస్తుండడంతో లాభాలు ఆశా జనకంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా సుమారు 250,కాటారం డివిజన్ లో 100,మండలంలో 30 ఎకరాల్లో ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. వీటిలో పందిరి సాగు 30 నుంచి 50 ఎకరాల్లో ఉంటుంది.
రోజువారీ ఆదాయం..
వాణిజ్య పంటలకు ఆరు నెలలకోసారి మాత్రమే ఆదాయం వస్తుంది. కానీ కూరగాయల సాగుతో రోజు వారీ ఆదాయం లభిస్తుంది. తాజా కూర గాయలను మార్కెట్కు తరలించి విక్రయించ వచ్చు. ఒక్కసారి ధర రాకపోయిన.. మరోసారి లాభసాటి గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు.
సబ్సిడీ అందిస్తున్నాం: మణి… ఉద్యానవన శాఖ అధికారి
శాశ్వత పందిరి వేసి కాకర, బీర, దొండ, సొరకాయ, ఇతర కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు 20గుంటలకు వంద పోల్స్ ఉన్న పందిరికి ప్రభుత్వం రూ. 50వేలు సబ్సిడీ అందిస్తోంది. ఒక్క రైతుకు 5 యూనిట్ల (రెండున్నర ఎకరాలు) వరకు సబ్సిడీ అందిస్తున్నాం. రానున్న రోజుల్లో టమాట సాగుకు సైతం సబ్సిడీ వచ్చే అవ కాశం ఉంది. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంకు పాస్ బుక్ డివిజన్ అగ్రికల్చర్ లేదా జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి.



