నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్లోని కీలక వాణిజ్య ప్రాంతం చాబహార్ ఫ్రీ ట్రేడ్ -ఇండస్టియల్ జోన్ (సిఎఫ్జెడ్) సమీపంలోని సైనిక స్థావరాలపై అమెరికా యుద్ధ విమానాలతో దాడికి పాల్పడింది. దాడులతో సిఎఫ్జెడ్ జోన్ ప్రాంతం వెనుక ఉన్న పర్వతం నుండి తీవ్రమైన పేలుళ్ల శబ్దం వినిపించిందని వాయిస్ ఆఫ్ అమెరికా పర్షియన్ లాంగ్వేజ్ సర్వీస్ ఆదివారం నివేదించింది. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 1992లో ఆగేయ ఇరాన్లోని సిస్తాన్ మరియు బలూచిస్థాన్ ప్రావిన్స్లో పాకిస్థాన్ సరిహద్దులో చాబహార్ ఫ్రీ ట్రేడ్ జోన్ స్థాపించబడింది. ఇది మధ్య ఆసియాను హిందూ మహా సముద్రానికి అనుసంధానించే వ్యూహాత్మక, పన్ను మినహాయింపు కేంద్రంగా ఉంది.
ఇరాన్కు సముద్ర రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా కీలక రవాణా కేంద్రంగా మారింది. చాబహార్లోని షాహిద్ బెహెస్టి టెర్మినల్ను ఇండియన్ పోర్ట్స్గ్లోబల్ లిమిటెడ్ నిర్వహించేందుకు, స్వల్పకాలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు భారత దేశం 2024 మేలో ఇరాన్తో పది సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. షాహిద్ బెహెస్టి టెర్మినల్లో బెర్త్లు, క్రేన్ల్లో భారత్ పెట్టుబడి కలిగి ఉంది.



