Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనివాసంలో లేని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారులకు నోటీసులు

నివాసంలో లేని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల లబ్దిదారులకు నోటీసులు

- Advertisement -

అనర్హుల స్ధానంలో అర్హులకు కేటాయిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ఏప్రిల్‌ 30వరకు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల క్యూర్‌ ( కోర్‌ అర్భన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రాష్ట్ర హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్ధలాలను గుర్తించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రులు శ్రీధర్‌ బాబు, అజహరుద్దీన్‌, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి క్యూర్‌ ఏరియాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు, అలాగే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏండ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలనీ, నోటీసులకు స్పందించని వారి ఇండ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంత మంది స్పందించారు అక్కడ నివాసం ఉండక పోవడానికి వారు చెప్పిన కారణాలపై ఆరా తీశారు. 2 బిహెచ్‌కే, జెఎన్‌ఆర్‌ఎమ్‌ తదితర పధకాల్లో ఇండ్లు పొంది నివాసం ఉండని ఇండ్లను మే 1 నుంచి పరిశీలించాలని అటువంటి వారికి నోటీసులు ఇచ్చి, స్పందించని పక్షంలో కేటాయింపుల ను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి బాండు పేపరుపై తాము ఇక్కడే నివాసం ఉంటామని లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ హామీ పొందాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్‌ టేకింగ్‌ తీసుకోవాలని సూచించారు. నాలుగు జిల్లాల పరిధిలో గల కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్‌, త్రాగునీరు, డ్రైనేజ్‌ వంటి కనీస వసతులను తప్పనిసరిగా కల్పించాలనీ, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ సహకారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా 22 వేల ఇండ్లకు విద్యుత్‌ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసంపూర్తి గా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం టవర్లు మొత్తం పూర్తయ్యేవరకూ ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్దిదారులకు కేటాయించాలన్నారు. వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదకన గాకుండా వేలం పద్ధతిలో విక్రయించాలనీ, ఆ విధంగా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వంకు కలిపి జాయింట్‌ అకౌంట్‌ పేరిట వేయాలన్నారు. ప్రజా ప్రయోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాలని తెలిపారు. ఈ విషయంలో సహకార శాఖ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎండీ, వీపీ గౌతమ్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -