ఎలక్ట్రిక్ వాహనాలుగా పెట్రోల్, డీజిల్ ఆటోలు
రెట్రో సంస్థతో ఉన్నతాధికారుల చర్చలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పర్యావరణ హిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ సంస్థలతో రవాణా శాఖ సంప్రదింపులు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో సోమవారం మూడు చక్రాల వాహనాల ఎలక్ట్రిక్ రెట్రోఫిట్మెంట్ సంస్థలతో ప్రత్యేకంగా రెండు సమావేశాలు జరిగాయి. తెలంగాణ రవాణా కమిషనర్ డా. కె. ఇలంబర్తి, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ నేతృత్వంలో వీటిని నిర్వహించారు. ఈ సమావేశాల్లో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ కిట్లతో ఈవీ వాహరాలుగా మార్చేందుకు రూపొందించబోయే విధానంపై విస్త్రృతంగా చర్చించారు.
ఈ చర్చల్లో సాంకేతిక ప్రమాణాలు, భద్రతా నిబంధనలు, సర్టిఫికేషన్ ప్రక్రియ, వ్యయ నిర్మాణం, బ్యాటరీ సాంకేతికతలు, అమలు విధానాలపై పూర్తిస్థాయిలో చర్చ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే విషయమై సాధ్యాసాధ్యాలపై రెట్రోఫిట్మెంట్ సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ కార్యక్రమం ద్వారా వాయు కాలుష్యం తగ్గడం, ఆటో డ్రైవర్లకు ఆపరేటింగ్ ఖర్చులు తగ్గడం, పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉంటాయని ఆ సంస్థలు తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడాన్ని ప్రోత్సహించే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమం కింద పెట్రోల్ , డీజిల్ ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ కిట్లతో ఈవీలుగా మార్చేందుకు ఆర్థిక సహాయం అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో సుస్థిర రవాణా వ్యవస్థను వేగంగా విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. రెట్రో ఫిట్మెంట్ సంస్థల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించి, సాధ్యమైన వాటిని విధాన రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోనున్నారు. పర్యావరణ హిత, అందుబాటులో ఉండే, సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.



