Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేను ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నా

నేను ఇప్పటికీ కాంగ్రెస్‌లోనే ఉన్నా

- Advertisement -

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉంటూ..
కాంగ్రెస్‌ నుంచి నన్ను వెళ్లమంటాడా?
40ఏండ్ల అనుబంధాన్ని ఎవరూ సులభంగా వదులుకోరు
ఎమ్మెల్యే సంజరు జోక్యంతోనే పార్టీలో కలహాలు : జగిత్యాలలో మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి
నవతెలంగాణ – జగిత్యాల

’40 ఏండ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లడం అంత సులభమేమీ కాదు.. అలాంటిది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న సంజరు నన్ను పార్టీ విడిచి వెళ్లాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన జోక్యం వల్లే జిల్లా పార్టీలో సమస్యలు తలెత్తాయి.. ఇలాంటి వారిని పార్టీకి హైకమాండ్‌ దూరంగా ఉంచాలి’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ జగిత్యాల సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజరుకుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారని అసెంబ్లీ స్పీకర్‌ తీర్మానించారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్‌లో చొరబడి తనను పార్టీ నుంచి వెళ్లిపోవాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాను పార్టీ వీడాలనే పరిస్థితి రావడానికి కారణం ఎవరో ప్రజలకు తెలుసని, సంజరు కుమార్‌ జోక్యం వల్లే కాంగ్రెస్‌ పార్టీలో సమస్యలు తలెత్తాయని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామని, ఎమ్మెల్యే జోక్యం లేకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. 2019 మినహా గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ జగిత్యాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. తాను నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ కోసం పనిచేస్తూ స్థానికంగా అనేక ఉద్యమాలు నిర్వహించినట్టు తెలిపారు. రాజకీయాల్లో గౌరవం ముఖ్యమని, అభిమానం దెబ్బతింటే కొనసాగడం కష్టమని తెలిపారు. కాంగ్రెస్‌ బలోపేతానికి కొన్ని చర్యలు అవసరమని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను దూరంగా ఉంచాలని సూచించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా కొనసాగుతానని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో అధికారులు స్పందించడం లేదని, యావర్‌ రోడ్డుపై అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ పంపు పేరిట ఆక్రమణలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -