Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకష్టం రైతులది..లాభం దళారులది..

కష్టం రైతులది..లాభం దళారులది..

- Advertisement -

కొనుగోలు కేంద్రాల్లేక మక్క రైతు నిలువు దోపిడీ
మద్దతు ధర రూ.2400
రైతు అమ్ముకుంటున్నది రూ.1600కే..
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల డిమాండ్‌

నవతెలంగాణ-రామాయంపేట
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసేది రైతులు అయితే.. పాలకుల వైఫలాల వల్ల ఆ లాభాలు దళారులు గడిస్తున్నారు. పాలకుల మాటలు కోటలు దాటుతున్నా.. చేతల్లో అమలు కాక క్షేత్రస్థాయిలో అన్నదాత బతుకు దళారుల హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతోంది. ప్రభుత్వం సకాలంలో మక్క కొనుగోలను కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. మద్దతు ధర రూ.2400 ఉంటే.. బయట రూ.1600కే అమ్ముకోవాల్సిన దుస్థితి ఉంది. మెదక్‌ జిల్లాలో మొక్కజొన్న విస్తీర్ణం ఎక్కువ. ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. కానీ, ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించలేదు.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లేక, మక్క రైతు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారులు కేవలం రూ.1,600కే పంటను కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్‌పై రైతు రూ.800 నష్టపోతున్నాడు. పండిన పంటలో సుమారు 35శాతం దళారులపాలవుతోంది. లాభం మొత్తం దళారుల జేబుల్లోకి వెళ్తుంటే, రైతుకు అప్పులు మిగులుతున్నాయి. రామాయంపేట ఉమ్మడి మండలంలో సుమారు 3,500 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది. అయితే, ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి, పంటను భద్రపరుచుకోవడానికి సరైన గోదాములు, వసతులు లేకపోవడంతో రైతులు గత్యంతరం లేని స్థితిలో దళారులకు అమ్ముకుంటున్నారు.

కేజేఎల్‌ కంపెనీకి క్యూ కడుతున్న రైతులు..
స్థానికంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, రామాయంపేట రైతులు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని కేజేఎల్‌ కోళ్ల దానా కంపెనీకి బారులు తీరుతున్నారు. రైతును రోడ్డున పడేస్తున్న దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు.

దళారులకు అమ్ముకుంటున్నా
నాలుగెకరాల మొక్కజొన్న పంట పండించాను. పంట చేతికొచ్చి 20 రోజులైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఎదురు చూసి, తప్పనిసరి పరిస్థితుల్లో 1800 రూపాయలకు క్వింటాల్‌ చొప్పున మధ్య దళారులకు అమ్ముకుంటున్నాను. పండిన పంటను నిలువ చేయడానికి సరైన స్థలం లేక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందో తెలియక తక్కువ ధరకైనా అమ్ముకోవాల్సి వచ్చింది. – బోడపట్ల రాజు- బచ్చురాజుపల్లి

రూ.1600కు క్వింటాల్‌ చొప్పున అమ్మా..
రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాను. పంట చేతికొచ్చి 15 రోజులు అయింది. తప్పనిసరి పరిస్థితిలో రూ.1600 క్వింటాల్‌ చొప్పున అమ్మాను. కొనుగోలు కేంద్రాలు లేక తీవ్రంగా నష్టపోయాను. – తొంట రాములు- బచ్చురాజుపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -