నవతెలంగాణ-హైదరాబాద్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన సంయుక్త వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీజేపీ ప్రతినిధి అశుతోష్, ఇతర విద్యార్థి నేతలు మంగళవారం భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్తో పాటు ఇతర రైతు నేతలను కలిసినట్లుగా పేర్కొంది. ఈ సమావేశంలో రైతులు, విద్యార్థులు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించే అంశంపై చర్చించారు.
సమావేశం అనంతరం అశుతోష్ మాట్లాడుతూ.. ‘దేశంలోని రైతులు, విద్యార్థులు, యువత కలిసి మోదీ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి ప్రశ్నించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్కు మద్దతు ఇవ్వాలని సీజేపీ ప్రతినిధులు రాకేశ్ టికాయత్ను కోరారు.



