- హసీనా సమావేశానికి హాజరైనందుకే అని అవామీ లీగ్ ప్రకటన
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ మాజీ క్రికెట్ కెప్టెన్, మాజీ అవామీ లీగ్ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి చేశారు. మగురా పట్టణంలోని కేశబ్మోర్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై బుధవారం రాత్రి సుమారు 8.45 గంటలకు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. దుండగులు ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భారతదేశంలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ విలేకరుల సమావేశానికి షకీబ్ అల్ హసన్ హాజరైన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు అవామీ లీగ్ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్లో నిర్వహించిన ఈ సమావేశంలో షకీబ్తో పాటు హసీనా కుమారుడు సజీబ్ వాసెద్ జాయ్, మాజీ విద్యాశాఖ మంత్రి మొహిబుల్ హసన్ చౌదరి కూడా పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో పాల్గొన్నందుకు ప్రతీకారంగానే షకీబ్ ఇంటిపై దాడి జరిగిందని అవామీ లీగ్ ఆరోపించింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న హింసకు ఈ ఘటన మరో ఉదాహరణ అని పార్టీ పేర్కొంది. వర్చువల్ సమావేశంలో షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను పునరుద్ధరించేందుకు తిరిగి వస్తానని ఆమె తెలిపారు. షకీబ్ అల్ హసన్ గతంలో బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు అవామీ లీగ్ తరఫున ఎంపీగా పనిచేశారు. తాజా దాడిపై భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.



