నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ బసంత్ కుమార్ మేఘ్వాల్ చారిత్రక ప్రదర్శనతో మెరిశాడు. పురుషుల హైజంప్ ఈవెంట్లో 2.21 మీటర్ల ఎత్తును అధిగమించిన బసంత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించాడు.
ఈ పోటీలో 19 ఏళ్ల బసంత్ కుమార్తో పాటు అల్జీరియాకు చెందిన యూనెస్ అయాచి, బ్రిటన్కు చెందిన ఓటిస్ పూల్ కూడా 2.21 మీటర్ల ఎత్తును విజయవంతంగా క్లియర్ చేశారు. ఆ తదుపరి ప్రయత్నంలో 2.24 మీటర్ల ఎత్తును అధిగమించడంలో ముగ్గురూ విఫలం కావడంతో, ‘కౌంట్బ్యాక్’ నిబంధన ఆధారంగా విజేతలను నిర్ణయించారు. ఈ నిబంధన ప్రకారం తక్కువ ప్రయత్నాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అల్జీరియా అథ్లెట్కు స్వర్ణం దక్కగా, బసంత్కు రజతం, బ్రిటన్ అథ్లెట్కు కాంస్య పతకాలు లభించాయి.
జాతీయ రికార్డు హోల్డర్ సహానా కుమారి పర్యవేక్షణలో బసంత్ శిక్షణ పొందుతున్నాడు. గతంలో బసంత్ అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా, తాజా ఛాంపియన్షిప్లో ఏకంగా 10 సెంటీమీటర్ల మేర మెరుగుపరుచుకుని 2.21 మీటర్ల మార్కును అందుకోవడం గమనార్హం.



