Monday, August 10, 2026
E-PAPER
Homeక్రైమ్లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌..రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె మృతి

లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌..రోడ్డు ప్రమాదంలో డీసీపీ కుమార్తె మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సెలవు కావడంతో సరదాగా గడుపుదామని ఆదివారం తన స్నేహితులతో కలిసి బీచ్‌కు బయలుదేరిన విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదం గుంటూరు నగర శివారులోని ఏటుకూరు సమీపంలో జరిగింది. కారులో ఉన్న ఆసిఫా ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లికి చెందిన ఉండి రుత్విక్‌ (జిమ్‌ నిర్వాహకుడు), అవినాష్, సుధీర్, షేక్‌ ఆసిఫా, వంశీ స్నేహితులు. వీరంతా ఆదివారం ఉదయం చీరాల వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఏటుకూరు సమీపంలోకి వచ్చిన సమయంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో లారీ ఆగింది.

కారు నడుపుతున్న అవినాష్‌ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను తాకి ఆగిపోయింది. కారు ముందుభాగంలో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నాయి. వెనుక సీటులో కూర్చున్న ఆసిఫా తలకు తీవ్రగాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది అక్కడికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆసిఫా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నల్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. రుత్విక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సుభాని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -