భూముల అక్రమ ఆక్రమణలపై విచారణకు ఎమ్మెల్యే ఫిర్యాదు
కలెక్టర్కు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేత
సుమారు 50 ఎకరాల భూములపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలో భూముల అక్రమ ఆక్రమణలపై నవతెలంగాణలో వెలువడిన కథనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి స్పందించారు. భూముల అక్రమ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను నిగ్గుతేల్చి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయికి బుధవారం కలిసి లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. పరకాల పట్టణంలోని సర్వే నంబర్లు 682, 683, 698, 195, 637, 640, 648, 750, 751, 752, 746, 749, 779 పరిధిలో సుమారు 50 ఎకరాల భూమి అక్రమ ఆక్రమణకు గురైనట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించి, భూముల వాస్తవ యాజమాన్య హక్కులను తేల్చాలని కోరారు.
నకిలీ పత్రాల ఆరోపణలపై విచారణ
కొన్ని భూములను నకిలీ లేదా కల్పిత పత్రాల ఆధారంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సంబంధిత భూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
నవతెలంగాణ కథనంపై ఎమ్మెల్యే నేరుగా స్పందించి జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో పరకాల పట్టణంలోని వివాదాస్పద భూములపై జిల్లా యంత్రాంగం ఎలాంటి విచారణ చేపడుతుంది, ఆరోపణల్లో వాస్తవమెంత అనేది తేలాల్సి ఉంది.



