– పర్యవేక్షించిన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి
– తీరుతున్న పురవాసుల చీకటి వెతలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గ కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణ ప్రధాన కూడలిలో చీకటి సమస్యకు పరిష్కారం లభిస్తోంది.గత కొన్నేళ్లుగా రోడ్డు విస్తరణ, డివైడర్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ పనులు కొనసాగుతున్న కారణంగా సరైన వెలుతురు లేక వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇటీవల కూడలి పరిసర ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో రాకపోకలు సులభమయ్యాయి. ఇంకా కొన్ని అప్రోచ్ రోడ్ల పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టాలని మున్సిపల్ పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో సుమారు రూ.2 లక్షల 50 వేల వ్యయంతో 6 ఎంఎస్, 400 వాట్ల సామర్థ్యం కలిగిన హైమాస్ లైట్లను కొనుగోలు చేసి ప్రధాన కూడలిలో కీలక ప్రదేశాల్లో బుధవారం ఏర్పాటు చేశారు.వీటితో రాత్రి సమయంలో కూడలి మొత్తం ప్రకాశవంతంగా మారి ప్రమాదాల అవకాశాలు తగ్గుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పనులను మున్సిపాలిటీ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ నాగరాజు కలిసి పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి మున్సిపాలిటీ మరిన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.



