నవతెలంగాణ-హైదరాబాద్: ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపంలో 38 మంది మరణించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. పలువురు గాయపడగా, భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నాగేకీయో ప్రాంతంలో సుమారు 2,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, సమాచార వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారులు కూడా దెబ్బతిన్నాయి. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికను జారీ చేసిన అధికారులు మూడు గంటల తర్వాత దానిని ఉపసంహరించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒక మీటరు లోపు ఎత్తైన అలలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం అనంతరం పలుచోట్ల ప్రకంపనలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



