బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా నేడు రాష్ర్ట వ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జనరల్ బాడీ సభ్యులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో కేటీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదనీ, తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల ఆత్మగౌరవమని పేర్కొన్నారు. 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి బీఆర్ఎస్ హయాంలో 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందిందన్నారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలోనూ పథకాన్ని అపలేదని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. నాలుగుసార్లు గడువిచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే కోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేసేందుకే నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్’ రద్దుపై నేడు నిరసనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



