నవతెలంగాణ-హైదరాబాద్: తూర్పు ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. కళ్యాణ్పురిలో ఓ పారిశుధ్య కార్మికుడు దారుణ హత్యకు గురైయ్యాడు. దీంతో ఆగ్రహించిన తోటి కార్మికులు NH-24పై ఆందోళన బాటపట్టారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్మికులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఉపాధి కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేయడానికి భారీగా పారామిలిటరీ బలగాలు మోహరించాయి. వారి ఆందోళనలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కూల్దీప్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయనను పోలీసులు నిర్భందంలోకి తీసుకున్నారు.
కల్యాణ్పురిలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో అనిల్ కుమార్ అనే పారిశుధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీలో ఉండగానే నిహాల్ అనే వ్యక్తి అతనిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వ్యక్తిగత కక్ష కారణంగానే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.



