జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి సూచించారు. కొల్లూరు గ్రామపంచాయతీ వద్ద ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటి అవసరంతో సాగయ్యే పెసర, మినుములు,ఉలవలు,మాగి జొన్న, అలసందలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు,ప్రోత్సాహకాలు అందిస్తున్న ఆయిల్ఫామ్ సాగు వైపు రైతులు అధిక సంఖ్యలో ముందుకు రావాలని కోరారు.
రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత మాట్లాడుతూ.. రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటు ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల సాగు చేపట్టాలని సూచించారు.వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా సాగులో ఎదురయ్యే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి హేమలత మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.బిందు సేద్యం,తుంపర సేద్యం పద్ధతులను వినియోగిస్తూ కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు.
పీఏసీఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పద్ధతులను రైతులు పాటించి, ప్రస్తుత వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు.ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న కష్టకాలం నుంచి రైతులు బయటపడేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు.కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకురాలు నిర్మల, తహసీల్దార్ ఆంజనేయులు,వ్యవసాయ అధికారి శ్రీనివాస్,ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి, పశుసంవర్ధక శాఖ అధికారి బాలు, కొల్లూరు గ్రామ సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్రెడ్డి,ఉప సర్పంచ్ గాజుల దశరథ,ఏఈవో అంజయ్య,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,పంచాయతీ కార్యదర్శి సాయిలు,రైతులు,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.



