నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. మంగళవారం ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని శిక్షణ సబ్ కలెక్టర్ ,ఇంచార్జి తహసీల్దార్ మద్దినేని మురళి క అందజేశారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల కనీస వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని అడగడమే రేవంత్రెడ్డి ప్రభుత్వ పాలనలో నేరంగా మారిందని విమర్శించారు. ఆశా వర్కర్లకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ పెండింగ్లో ఉన్నాయని, లెప్రసీ సర్వే, పల్స్పోలియో, ఎన్నికల విధులు తదితర బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏఎంసీ, పీఎంసీ టార్గెట్లను రద్దు చేయాలని, ఆశా వర్కర్లకు రూ.50 లక్షల బీమా సౌకర్యంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీత, రజిని, సంధ్య, నాగమణి, వరదరాణి, సుజాత, రాధ, బాబురావు తదితరులు పాల్గొన్నారు.



