Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వృద్ధ తల్లిదండ్రులకు ఊరట.!

వృద్ధ తల్లిదండ్రులకు ఊరట.!

- Advertisement -

వృద్ధాప్యంలో అమ్మానాన్నల పోషణ బాధ్యత పిల్లలదే..
నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల వేతనం నుంచి 15శాతం కోత
ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోనే పరిష్కారానికి చర్యలు 
నవతెలంగాణ – మల్హర్ రావు

కని, పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను కొందరు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. వారి పోషణ తమకు భారంగా భావిస్తున్నారు. తమను కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఎందరో తల్లిదండ్రులు వయో వృద్ధుల ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి భరోసా కల్పించేందుకు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటి అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్ట్ యాక్ట్ -2026ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది.ఇది పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యే తల్లిదండ్రులకు అండగా నిలవనున్నది.

తల్లిదండ్రుల ఆత్మగౌరవం కాపాడేందుకే..
పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు ప్రభుత్వం అందించే పింఛన్లు ఆసరాగా నిలుస్తున్నాయి. కానీ ఉద్యోగం చేసే సంతానం ఉన్న వారికి పెన్షన్ రాక పోగా, కొంత మంది కొడు కులు తల్లిదండ్రులను పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తల్లిదండ్రుల మద్దతు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తే నిరాదరణకు గురవుతున్న ఎంతో మంది తల్లిదండ్రులకు మేలు కలుగుతుంది.

విశ్రాంత ఉద్యోగులకూ కష్టాలే..
ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన పెన్షనర్లలో చాలా మంది తమ సంతానం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెలా వచ్చే పింఛన్ డబ్బుల కోసం వేధించేవారు కూడా ఉన్నారు. కొందరైతే తల్లి, లేదా తండ్రి బ్యాంక్ పాసుపుస్తకం, ఏటీఎం కార్డులను తమవద్దనే ఉంచుకొని వారి పింఛన్ ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు డబ్బులు డ్రా చేయగానే వారిని బెదిరించి లాక్కుంటున్నారు.

ఫిర్యాదు ఇలా..
బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో జిల్లా కలెక్టరేట్ ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరొక ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వం లోని ప్రత్యేక కమిషన్ను కలిసే వెసులుబాటును కూడ కల్పించారు.

వేతనంలో కోతే..
నూతన చట్టం ప్రకారం తమను పిల్లలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగుతుంది. విచారణ జరిపి ఆరోపణలు నిజమని తేలితే సదరు ఉద్యోగి జీతం నుంచి 15 శాతం లేదా గరిష్టంగా రూ.10వేలు (ఏది తక్కువైతే అది) కోత విధిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే ఆ కోత మొత్తాన్ని అందరి జీతాల నుంచి సమానంగా వసూలు చేస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే వారందరికీ వర్తిస్తాయి. అయితే పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిన వృద్ధులకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. పెన్షన్, ఇతర ఆదాయ వనరులు ఉన్న తల్లిదండ్రులకు వర్తించదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -