నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటక వేదికగా జరిగిన సౌత్ జోనల్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలు సమిష్టి స్వరం వినిపించాయి. డీలిమిటేషన్, కేంద్ర నిధుల పంపకం, రాష్ట్రాల హక్కులు, నదుల అనుసంధానం, అభివృద్ధి, కనెక్టివిటీ వంటి అంశాలపై దక్షిణాది రాష్ట్రాల నేతలు తమ అభిప్రాయాలను బలంగా వినిపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా నియోజకవర్గాలను కొనసాగించాలని కోరారు. ప్రస్తుత లోక్సభలోని 543 స్థానాలను యథాతథంగా కొనసాగిస్తూ, అదే స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించారు. తమిళనాడు రాజకీయ నేత విజయ్ కూడా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధమైన హామీ అవసరమని డిమాండ్ చేశారు.
దక్షిణాది ఉమ్మడి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ సమస్యలను కూడా చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన సమస్యలను పరిష్కరించాలని కోరారు. 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేరళ కూడా కేంద్ర నిధుల పంపకం, తీర రక్షణ, ఆఫ్షోర్ మైనింగ్ అంశాలను సమావేశంలో ప్రస్తావించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి తగినంత నిధులు రావడం లేదని కేరళ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.1,493 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం కేవలం రూ.151 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆ రాష్ట్రం పేర్కొంది. కేరళ తీర ప్రాంతంలో 63 శాతం మేర కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.



