– బహిర్గతమైన బీఆర్ఎస్ వర్గ విభేదాలు
– జీఓ నంబర్ 97కు వ్యతిరేకంగా రెండు వర్గాల నిరసన
– రహదారిపై బైఠాయించి నినాదాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 97కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అశ్వారావుపేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కార్యక్రమం ఒకటే అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా నిరసన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ముందుగా పట్టణ మాజీ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ ఆధ్వర్యంలో కొందరు నాయకులు, కార్యకర్తలు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద జీఓ నంబర్ 97కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా, మరోవైపు మండల కన్వీనర్ జేకేవీ రమణారావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట అశ్వారావుపేట–సత్తుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
ఈ క్రమంలో ముందుగా కార్యాలయానికి చేరుకున్న వర్గం కూడా రహదారిపై బైఠాయించిన నాయకులతో కలిసి నిరసనలో పాల్గొని నినాదాలు చేసింది. అనంతరం సత్యవరపు సంపూర్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు భూక్యా జ్యోతి, కొల్లి రవికిరణ్ పేర్లతో ఉన్న వినతిపత్రాన్ని తహశీల్దార్ దాసరి కిశోర్కు అందజేశారు.
పార్టీ ఆదేశాల మేరకే నిరసన : మండల కన్వీనర్ జేకేవీ రమణారావు
పార్టీ అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాల మేరకు జీఓ నంబర్ 97కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని మాత్రమే పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ మండల కన్వీనర్ జేకేవీ రమణారావు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని పేర్కొన్నారు.
అయితే ఒకే కార్యక్రమాన్ని రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహించడంతో పార్టీలోని అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీ కేడర్ను అయోమయానికి గురిచేస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.



