‘అమెరికా’ నుంచి ఎన్నికైక తొలి పోప్గా ఫ్రాన్సిస్కు ప్రత్యేక గుర్తింపు
నవతెలంగాణ-హైదరాబాద్: పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. సోమవారం వాటికన్లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం సందేశం కూడా ఇచ్చారు. అలాగే ఆదివారం వాటికన్లో పోప్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. ఈ సందర్భంగా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైన తొలి పోప్గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా తన గళమెత్తారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.