నవతెలంగాణ – హైదరాబాద్ : : సనత్నగర్ ఆస్పత్రిని సందర్శించేందుకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు నిర్బంధించారు. కోకాపేటలోని మాజీ మంత్రి హరీశ్రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరీశ్రావును హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సనత్నగర్ ఆస్పత్రి సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా తనను అక్రమంగా నిర్బంధించడంపై హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్రావు మండిపడ్డారు.



