నవతెలంగాణ-హైదరాబాద్: బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రత్యేక ప్రకటనపై వివాదం రేకెత్తడంతో జివా సంస్థ వెనక్కి తగ్గింది. కృతి సనన్ నటించిన ఆ ప్రకటనను సంస్థ తాజాగా తొలగించింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని బ్రాండ్ పేర్కొంది. ఆ గౌరవంతోనే ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.ఈ ప్రకటనలో కృతి డ్రెస్సింగ్పై కొంతమంది సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రక్షాబంధన్ వంటి సాంప్రదాయ పండుగకు ఈ తరహా దుస్తులు సరిపోతాయా అంటూ ప్రశ్నలు వచ్చాయి. ప్రకటనలో కుక్కకు రాఖీ కట్టే సన్నివేశం కూడా చర్చకు దారితీసింది. కంగనా వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై కృతి సనన్ కూడా స్పందించింది. మహిళ ఏ దుస్తులు ధరించాలనే విషయంపై సమాజం ఎప్పటికీ తీర్పులు ఇస్తూనే ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సంస్కృతి, సాంప్రదాయాలు ఒక మహిళ ధరించే దుస్తుల్లో కాకుండా ఆమె హృదయంలో ఉంటాయని కృతి పేర్కొంది. కేవలం దుస్తులను ఆధారంగా చేసుకుని ఒక మహిళకు తన సంస్కృతి పట్ల గౌరవం ఉందా లేదా అని నిర్ణయించడం సరికాదని ఆమె అభిప్రాయపడింది.



