. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు
నవతెలంగాణ – స్టేషన్ ఘనపూర్ : రక్షాబంధన్ పండుగ సందర్భంగా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లోనే కాకుండా సమాజంలోనూ సోదరభావం, పరస్పర గౌరవం, రక్షణ భావనలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
గురువారం బ్రహ్మకుమారీ సోదరీమణులు కడియం శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయనకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ రాఖీ కట్టే ఆడపడుచుల ప్రేమాభిమానాలను గౌరవించడం ప్రతి అన్నదమ్ముడి బాధ్యత అన్నారు. ఆడపడుచులు సుఖసంతోషాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల మధ్య బంధాన్ని గుర్తుచేసే పండుగ మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ పరస్పరం అండగా నిలిచి ప్రేమ, ఆప్యాయత, మానవత్వంతో ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తన తరఫున ప్రత్యేకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ఆధ్యాత్మికత, శాంతి, మానసిక ప్రశాంతత, మానవీయ విలువలను పెంపొందించేందుకు బ్రహ్మకుమారీ సంస్థ చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. తన నివాసానికి వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ సోదరీమణులకు కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచు సంతోషమే తనకు ముఖ్యమని, వారి ఆశీస్సులు, ఆత్మీయత ఎల్లప్పుడూ తనకు బలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



