Friday, September 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం..

ఇరాన్‌తో చర్చలపై అమెరికా కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇరాన్‌తో చర్చలకు అమెరికా తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది. వాణిజ్య నౌకలపై దాడులు ఆపే వరకు టెహ్రాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌ చర్యలను బట్టి తమ ఆపరేషన్లు కొనసాగుతాయని చెప్పారు. వాటికి ఎలాంటి గడువు విధించబోమన్నారు.

వైట్‌హౌస్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వాన్స్‌ మాట్లాడారు. వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నంత కాలం ఇరాన్‌తో చర్చలు ఉండవని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంగా చెప్పారని తెలిపారు.

హర్మూజ్‌ జలసంధిలో ఇంధన రవాణా సజావుగా సాగడమే ప్రస్తుతం అమెరికా ప్రధాన లక్ష్యమని వాన్స్‌ చెప్పారు. తమ చర్యల వల్ల గురువారం రాత్రి 1.5 కోట్ల బ్యారెళ్ల చమురు హర్మూజ్‌ జలసంధి నుంచి బయటకు వెళ్లిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం రాకుండా అమెరికా చర్యలు అడ్డుకున్నాయని తెలిపారు.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా వద్ద ఆర్థిక, సైనిక, దౌత్య, రహస్య చర్యలు సహా అన్ని మార్గాలు ఉన్నాయని వాన్స్‌ చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తిరిగి నిర్మించకుండా అడ్డుకోవడం కూడా తమ లక్ష్యమన్నారు.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచడంలో చైనా సహకరిస్తోందని వాన్స్‌ తెలిపారు. టెహ్రాన్‌కు ఆర్థిక సేవలను పరిమితం చేసే విషయంలో చైనా కొన్ని అమెరికా అభ్యర్థనలకు స్పందించిందన్నారు. టర్కీ, అజర్‌బైజాన్‌, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌ కూడా ఇరాన్‌పై ఒత్తిడి పెంచడంలో సహకరిస్తున్నాయని చెప్పారు.

హర్మూజ్‌ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం. గల్ఫ్‌ దేశాల నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు చమురు తరలింపులో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడితే ఇంధన ధరలు, బీమా ఖర్చులు, రవాణా వ్యయం పెరిగే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -