నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ వరుస ఇంటర్వ్యూలతో కాంగ్రెస్ సర్కార్పై, పార్టీ అంతర్గత పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ మీడియా ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆమె ప్రశంసల వర్షం కురిపించడం… ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో బీఆర్ఎస్లో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవహారశైలి ఎలా ఉండేదన్న ప్రశ్నకు సురేఖ స్పందిస్తూ… “కేసీఆర్ గారు చాలా మంచి వ్యక్తి. తమను ఎప్పుడు కలిసినా ఎంతో గౌరవంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారు” అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినన్ని రోజులు కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు రాలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం అడిగిన వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. నాడు కొండా మురళికి ఎమ్మెల్సీ పీఠం దక్కకుండా పార్టీలోని కడియం శ్రీహరి వంటి కొందరు సీనియర్ నేతలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని, కానీ కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని మిగిలిన వారి నామినేషన్లను ఉపసంహరింపజేసి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూశారని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తీవ్ర అసంతృప్తితో, బర్తరఫ్ వేటుతో బయటకు వచ్చిన కొండా సురేఖ.. కేసీఆర్ పాలనను, ఆయన వ్యక్తిత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కేసీఆర్పై సురేఖ చేసిన సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో కొండా దంపతులు కాంగ్రెస్కు గుడ్బై చెప్పి… బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందా? అనే ప్రచారం జోరందుకుంది.



