నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై రేపు (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఓటింగ్కు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరగనుంది.
బిల్లులపై చర్చ చేపట్టాలా వద్దా అన్న అంశంపై సభ్యుల మధ్య డివిజన్ జరిగింది. అయితే బిల్లులపై చర్చ చేపట్టాలని 251 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేశారు. 185 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో బిల్లులపై చర్చ ప్రక్రియ మొదలైంది. తొలుత ఈ బిల్లులను మోజువాణీ ఓటు ద్వారా పాస్ చేశారు. కానీ విపక్షాల అభ్యంతరం నేపథ్యంలో మళ్లీ విభజన చేసి ఓటింగ్ నిర్వహించారు. 251 మంది అనుకూలంగా ఓటు వేయడంతో.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ ప్రక్రియకు చెందిన రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను కలిపి సభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ నేత వేణుగోపాల్ వ్యతిరేకించారు. రెండు బిల్లులను కలపడం మంచి విధానం కాదు అని, దీని వల్ల పరిణామాలు ఉంటాయని, ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి పాలైతే, అప్పుడు దీంట్లో అర్థం ఏం ఉంటుందని వేణుగోపాల్ అన్నారు



