నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలో సత్యనికేతన్ భవనం కూలిపోయిన ఘటనపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ‘ట్రిపుల్-ఇంజిన్’ ప్రభుత్వం ఉండగా ఈ నిస్సహాయతకు సాకు ఏమిటని లోక్సభ ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించారు. ప్రశ్నలు అడిగే వారిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘దిమాగీ నక్సల్’, ‘నారాజ్ ఫుఫా’ వంటి అవమానకరమైన ముద్రలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రతిసారీ బీజేపీ ప్రభుత్వం అదే సిగ్గుచేటైన విధానాన్ని అనుసరిస్తుందని, ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు చేపట్టకపోవడం, అవి జరిగిన తర్వాత కేవలం ఆర్భాటపు ప్రకటనలు చేయడం, అలాగే అసలైన బాధ్యులను వదిలేసి కింది స్థాయి అధికారులపై నిందలు మోపడం వంటివి బీజేపీ ప్రభుత్వాలకు సర్వసాధారణం అని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు.



