Sunday, April 19, 2026
E-PAPER
Homeప్రత్యేకంజ్ఞాన పరిమళం పుస్తకం

జ్ఞాన పరిమళం పుస్తకం

- Advertisement -

‘ఏప్రిల్‌ 23న వరల్డ్‌ బుక్స్‌ డే అంట కదా” చిరకాల స్నేహితుడు అనగానే ఒక్కసారిగా మనస్సులో ఎన్నో జ్ఞాపకాలు పరుగులెత్తాయి.

ఊర్లో చిన్నప్పుడు ఆడుకునే మున్సిపల్‌ పార్కులో ఒక చిన్నపిల్లల లైబ్రరీ వుండేది. అందులో రంగురంగుల బొమ్మలతో ఎన్నో పుస్తకాలు వుండేవి. పక్షులు, జంతువులు మనుషుల్లా మాట్లాడుతుండే కథలు. పంచతంత్ర కథలు.. అక్బర్‌ బీర్బల్‌ కథలు..అల్లావుద్దీన్‌ అద్భుత ద్వీపం.. బోలెడు పుస్తకాలు నా ఊహా ప్రపంచానికి ద్వారాలు తెరిచాయి. తర్వాత సోవియట్‌ పుస్తకాలు ఆకుపచ్చ ద్వీపం, అడవిలో ఇళ్లు, పిల్లల జంతు కథలు, ధైర్యంగల చీమ అద్భుత కథ, చిన్నారి కోడి పుంజు బంగారు మేని గౌను లాంటి పుస్తకాలు బొమ్మలతో సహా మనసులో ముద్రించుకుపోయేవి. టామ్‌ సాయర్‌, హకల్‌ బెరీ ఫిన్‌, అంకుల్‌ టామ్స్‌ కేబిన్‌ లాంటి పుస్తకాలతో ప్రేమలో పడిపోయాను. ఆ లైబ్రేరియన్‌ నేను పుస్తకాలు దొంగిలించకుండా వెయ్యి కళ్ళతో కాపలా కాస్తుండేవాడు. ఆ తర్వాత క్లాసులో తెలుగు పుస్తకాలు కూడా నన్ను ఆకర్షించేవి. ఆ పద్యాలు, కవిత్వం శ్రద్ధగా వినేవాడిని. మా తెలుగు మాష్టారు కూడా పద్యాలు రాగయుక్తంగా పాడుతూ, అర్థమయ్యేట్టు చెపుతూ ఆ ఆసక్తిని రెట్టింపు చేసేవాడు. మధుబాబు, యండమూరి, చలం, తిలక్‌, బుచ్చిబాబుల పుస్తకాలతో నా నవ యవ్వన దినాలు నిండిపోయాయి. వారి కల్పనకు నేను చేసుకున్న ఊహాలోకంలో నివశిస్తుండేవాడిని.
”పుస్తకాలంటే చాలు.. లోకాన్ని మర్చిపోతావ్‌.. ఏముందిరా అంత పుస్తకాలలో..?” అడిగాడు మిత్రుడు.
”ఒకళ్ళ సంగతేమో గానీ, పుస్తకాలు నాకు అమ్మానాన్న లేని లోటు తీర్చాయి. అన్నలా, అక్కలా వెన్నంటే వుండి మంచి, చెడు చెప్పాయి. పుస్తకాలే నన్ను తీర్చిదిద్దాయి. వివేకం నేర్పాయి.

మనిషిని మంచి మానవునిగా తీర్చిదిద్దతాయి. ఒక వ్యక్తి ఎంత ధనవంతుడో తెలుసుకోవాలంటే అతని బ్యాంకు బ్యాలెన్స్‌ చూడకూడదు, అతని ఇంట్లో ఉన్న పుస్తకాల సంఖ్య చూడాలి. పుస్తకాలు మన అభిరుచులను, ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత మనం కొత్త లోకాల్లోకి ప్రయాణం చేస్తాం. చూడని దేశాలు చూస్తాం, తెలియని వ్యక్తులతో సంభాషిస్తాం, అనుభవించని భావోద్వేగాలను గుండెలో నింపుకుంటాం.”
”అమ్మో.. ఆపు ఆపు..అంత గుక్క తిప్పుకోకుండా చెపితే ఎలా ? కాస్త నిదానించి చెప్పు..” నన్ను ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మిత్రుడు.
నేను చిరునవ్వు నవ్వి ”చదవడం వల్ల మన మెదడు సక్రియమవుతుంది. కల్పనా శక్తి పెరుగుతుంది. భాషా నైపుణ్యం మెరుగుపడుతుంది. సహానుభూతి వద్ధి చెందుతుంది. ఒక నవలలోని పాత్రల దుఃఖాన్ని, సంతోషాన్ని మనం స్వయంగా అనుభవిస్తాం. దాని వల్ల నిజ జీవితంలో ఇతరులను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. చరిత్ర పుస్తకాలు గతాన్ని బోధిస్తాయి. విజ్ఞాన పుస్తకాలు భవిష్యత్తును తెరుస్తాయి. ఆత్మకథలు ప్రేరణనిస్తాయి. కవిత్వం హదయాన్ని తాకుతుంది. పుస్తకం ఒక్కటే మనల్ని ఒంటరితనం నుంచి రక్షిస్తుంది. ప్రయాణంలో, విశ్రాంతి సమయంలో, ఒత్తిడి మధ్య — ఎప్పుడైనా అది మనకు తోడుగా ఉంటుంది.” అన్నాను.
”అది సరే..అది మన రోజులు. ఇప్పుడంతా మొబైళ్ళు.. గేములు, రీల్లు.. పుస్తకాలు ఎవరు చదువుతున్నారు? అంతా డిజిటల్‌ అయింది కదా..” అన్నాడు సందేహంగా మిత్రుడు.
”నువ్వన్నది నిజమే.. కానీ కాలం తన అవసరాలకు అనుగుణంగా మారుతూనే వుంటుంది. ఎవరికి తగిన మార్గం వాళ్ళు ఎంచుకుంటారు. ఈ డిజిటల్‌ యుగంలో మొబైల్‌, స్క్రీన్‌లు మన సమయాన్ని హరించేస్తున్నాయి. కానీ పుస్తకం చదవడం మాత్రం ఒక భిన్నమైన అనుభవం. స్క్రీన్‌ మీద చదివడం వేరు. మరో మార్గం లేనప్పుడు మనకు డిజిటల్‌ బుక్సే దిక్కు. కానీ పుస్తకం ఇచ్చే అనుభవం డిజిటల్‌ బుక్‌ ఇవ్వలేదు. చూడు.. ఇష్టమైన పుస్తకం పట్టుకున్నప్పుడు, ఆ పేజీలు తిరగేసినప్పుడు..ఆ కాగితాల నుండి వచ్చే సుగంధపు వాసన, ఆ పుస్తకం మధ్యలో మనం పెట్టుకునే గుర్తులు..ఆ అక్షరాల మధ్య ప్రయాణం..ఆ జ్ఞాపకాల అనుభవాలు..స్నేహితులతో పుస్తకం ఇచ్చిపుచ్చుకోవడాలు..ఇవన్నీ ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇవ్వలేవు. ‘ఇంట్లో పుస్తకాలు వుంటే ఆ ఇల్లు స్వర్గం’ అన్నాడు లూయిస్‌ బోర్జెస్‌” అన్నాను నేను.
”సరే..పెద్దవాళ్ళకంటే మనం చెప్పొచ్చు. వింటారు. పిల్లలకు ఎలా? వాళ్ళు వినడం లేదే..”
” అవును. పిల్లల ప్రయారిటీస్‌ మారిపోయాయి. వారి లోకం కూడా మారిపోయింది. వాళ్ళలో పుస్తకాలు చదవాలనే ఆలోచన రావాలంటే మన ఇంట్లో పుస్తకాలు వుండాలి. మొబైల్‌ అవతల పెట్టి అవి మనం చదువుతుండాలి. అప్పుడే పిల్లలు కూడా పుస్తకాల పట్ల శ్రద్ద చూపుతారు. అందుకే పిల్లలకు చిన్ననాటి నుంచే పుస్తకాల అలవాటు చేయాలి. వద్ధులు తమ అనుభవాలను పుస్తకాల రూపంలో వారసులకు అందించాలి. పుస్తకాలు తరాల మధ్య వారధి వేస్తాయి. సమాజాన్ని చైతన్యపరుస్తాయి. అవి ఎప్పుడూ మనకు నిజాయితీగా మార్గం చూపుతాయి. మిగతా అకడమిక్‌ పుస్తకాలకు, సాహిత్యానికి తేడా ఏమిటంటే ఈ పుస్తకాలు మనిషిని మనిషిగా మిగులుస్తాయి. పుస్తకాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ప్రశ్నలు అడగమంటాయి. సమాధానాలు వెతకమంటాయి. అవి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, మనల్ని మంచి మానవులుగా మారుస్తాయి. ఇది ఈ రోజుల్లో మనుషులకు లోపిస్తోంది” అన్నాను.
” నువ్వన్నదీ నిజమేనోరు.. ఈ మాటలు చెపితే మేము అలాంటివాళ్ళమా అని తగాదాకి దిగుతారు. ఇంకేమయినా ఉపయోగాలున్నాయని చెప్పొచ్చా వాళ్ళకు..,?
” ఎందుకు లేవు..బోలెడున్నాయి. వరసగా చెపుతాను.
1. మానసిక ఒత్తిడి తగ్గుతుంది
ఒక అధ్యయనం ప్రకారం, కేవలం 6 నిమిషాలు నిశ్శబ్దంగా పుస్తకం చదివితే ఒత్తిడి 68% వరకు తగ్గుతుంది. ఇది సంగీతం వినడం లేదా నడక కంటే ఎక్కువ ప్రభావవంతంగా వుంటుంది. రాత్రి పడుకునే ముందు చదవడం వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది.
2. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది డ జ్ఞాపకశక్తి పెరుగుతుంది
పుస్తకాలు చదవడం మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది. ఇది Alzheimers, Dementia వంటి సమస్యలు రావడాన్ని ఆలస్యం చేస్తుంది లేదా తగ్గిస్తుంది. ముసలితనంలో మెదడు క్షీణతను 32% వరకు తగ్గించవచ్చు. చదవడం వల్ల మెదడులోని న్యూరల్‌ మార్గాలు బలపడతాయి, ఏకాగ్రత (focus), విశ్లేషణాత్మక ఆలోచనలు పెరుగుతాయి.
3. సానుభూతి (Empathy), భావోద్వేగ నైపుణ్యాలు పెరుగుతాయి
ముఖ్యంగా నవలలు, కథలు చదవడం వల్ల ఇతరుల భావాలు, ఆలోచనలు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇది ఇతరుల మనసు అర్థం చేసుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా మానవ సంబంధాలు మెరుగవుతాయి.
4. పదజాలం (Vocabulary),, భాషా నైపుణ్యం వృద్ధి
పుస్తకాలు చదవడం వల్ల కొత్త పదాలు సహజంగా నేర్చుకుంటాం. ఇది భాషా పటిమ, వ్యాకరణం, విమర్శనాత్మక ఆలోచనలను మెరుగుపరుస్తుంది. విద్యార్థుల్లో అకడమిక్‌ పనితీరు మెరుగుపడుతుంది.
5. జ్ఞానం, సృజనాత్మకత (Creativity)
ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచాన్ని తెరుస్తుంది. చరిత్ర, విజ్ఞానం, ఆత్మకథలు — ఏదైనా చదివినా జ్ఞానం విస్తరిస్తుంది. కల్పనా శక్తి, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం పెరుగుతాయి.
6. జీవితకాలం పెరుగుతుంది (Longevity)
Yale University అధ్యయనం ప్రకారం, పుస్తకాలు చదివే వారు చదవని వారి కంటే సగటున 2 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తారు. 12 సంవత్సరాల అధ్యయనంలో పుస్తకాలు చదివే వారికి మరణం ప్రమాదం 20% తక్కువగా ఉంది. ఇది మెదడు ఆరోగ్యం, ఒత్తిడి తగ్గడం వంటి కారణాల వల్ల వస్తుంది.”
” ఏంటి గురూ..ఇన్ని ఉపయోగాలా.. శారీరకంగా, మానసికంగా కూడా బలే ఉపయోగాలు వున్నాయి. అయితే రేపే మా ఇంట్లో పుస్తకాలు చదివేటట్టు పోగ్రాం మొదలుపెడతాను. ముందుగా ఏం చేయాలో చెప్పు..”
”పుస్తకాలు చదివించాలంటే పిల్లలకయినా, పెద్దలకయినా కొన్ని టెక్నిక్స్‌ వున్నాయి.. చెపుతాను.. గుర్తు పెట్టుకో..
1. మీ అభిరుచిని గుర్తించండి
మీకు ఏ విషయం మీద చదవడం ఆసక్తి కలిగిస్తుందో ఆలోచించండి, కథలు, ఆత్మకథలు, విజ్ఞానం, చరిత్ర, వ్యక్తిత్వ వికాసం, హాస్యం..ఇలా అన్నమాట. ఇష్టం లేని పుస్తకం బలవంతంగా చదవకండి. మొదట్లో ఆసక్తికరమైన రకం తీసుకోండి.
2. చిన్న లక్ష్యంతో మొదలుపెట్టండి
రోజుకు 5-10 నిమిషాలు లేదా 5-10 పేజీలు మాత్రమే చదవాలని నిర్ణయించుకోండి. ఇది భారం అనిపించదు.
ఒక్కసారిగా 400 పేజీల పుస్తకం తీసుకోకండి. 100-150 పేజీల చిన్న పుస్తకాలతో ప్రారంభించండి.
ఒక పుస్తకం పూర్తి చేసిన తర్వాతే మరొకటి తీసుకోండి. ఇది విజయం భావనను ఇస్తుంది.
3. రోజువారీ పనిలో భాగంగా చేర్చండి
ఒక నిర్దిష్ట సమయం కేటాయించండి: ఉదయం లేవగానే, రాత్రి పడుకోబోయే ముందు, లంచ్‌ బ్రేక్‌లో, ప్రయాణ సమయంలో..ఏదొక టైమ్‌. పుస్తకాన్ని ఎప్పుడూ కనిపించే చోట పెట్టుకోండి (పడక దగ్గర, బ్యాగ్‌లో). ఫోన్‌ను మరో గదిలో పెట్టి, డిస్ట్రాక్షన్‌ లేకుండా చదవండి.
4. సరైన వాతావరణం సృష్టించండి
మంచి వెలుతురు, సౌకర్యవంతమైన స్థానం ఎంచుకోండి. నిశ్శబ్ద వాతావరణం ఉండేలా చూసుకోండి. మ్యూజిక్‌ ఇష్టమైతే సాఫ్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పెట్టుకోవచ్చు. ఆడియోబుక్స్‌ కూడా లెక్క… ప్రయాణంలో, పని చేస్తూ కూడా వినవచ్చు.
5. అలవాటు మెరుగుపరచడానికి చిట్కాలు
చదివినప్పుడు కొత్త పదాలు గమనించి, నోట్‌ చేసుకోండి (ఫ్లాష్‌కార్డ్స్‌ ఉపయోగించవచ్చు). ఒక పుస్తకం నచ్చకపోతే బలవంతంగా చదవకండి, మరొకటి తీసుకోండి. స్నేహితులతో, బుక్‌ క్లబ్‌లో చర్చించండి, ఇది ఆసక్తిని పెంచుతుంది.
మొదటి 21 రోజులు కష్టంగా అనిపించవచ్చు, కానీ తర్వాత అది అలవాటుగా మారి, ఆనందంగా మారుతుంది. ఏమంటావు మిత్రమా..?”
మిత్రుడు అవాక్కయినట్టు ఒక నిమిషం అలాగే నావైపు చూసి, మెచ్చుకోలుగా భుజం తట్టాడు.
”ఇప్పుడు అర్థమయిందిరా. ఎన్ని సమస్యలు వున్నా నువ్వెందుకు ఆనందంగా వున్నావో.. పుస్తకం నీకు ఏ విషయంలో అయినా తోడు వుండి, దారి చూపిస్తుంది అనమాట” అన్నాడు.

”సరిగ్గా చెప్పావు..” అన్నాను నవ్వుతూ..
మిత్రుడు ఆనందంగా సెలవు తీసుకొని, వెళ్ళిపోయాడు. అతను తన ఇంటిని పుస్తకాలతో స్వర్గతుల్యం చేసుకుంటాడని ఆశిస్తున్నాను.
అతనే కాదు. మనమందరం కూడా ఇదే పని చేయాలి. ఎందుకంటే మనం మన పరిమితుల్ని అధిగమించి పనులు చేయాలంటే, మనకి ప్రేరణ ఇచ్చేవి పుస్తకాలే. మన మెదడు ఒక పరిమితి వరకు మాత్రమే విషయాలను నిల్వ ఉంచగలదు. కానీ పుస్తకాలు మాత్రం ఆ జ్ఞానాన్ని శాశ్వతంగా సంరక్షిస్తాయి. మనం మరచిపోయిన విషయాలను తిరిగి గుర్తు చేసే నిశ్శబ్ద మిత్రులు అవి. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. మనం ఎక్కడికీ వెళ్లకపోయినా, పుస్తకాల ద్వారా అనేక దేశాలు, సంస్కతులు, మనుషుల జీవితాలను తెలుసుకోవచ్చు. ‘ఒక పాఠకుడు చనిపోయే ముందు వేయి జీవితాలు గడుపుతాడు. చదవని వ్యక్తి ఒక్క జీవితం మాత్రమే గడుపుతాడు’ అన్నాడు అందుకే జార్జి మార్టిన్‌.
ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు పుస్తకాల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, చదివే అలవాటును పెంపొందించుకోవాలని సూచిస్తుంది. యునెస్కో ప్రారంభించిన ఈ కార్యక్రమం పుస్తకాలు, ఆ పుస్తక రచయితలను గౌరవించడానికి ఒక మంచి అవకాశం.
చివరిగా చెప్పాలంటే, పుస్తకం కేవలం ఒక కాగితాల కట్ట మాత్రమే కాదు. అది జ్ఞానానికి నిలయం. మనసుకు ఊరట. జీవితానికి మార్గదర్శి. పుస్తకాన్ని తన మట్టిగుండెలో నాటుకున్న మనిషి జ్ఞాన పరిమళాన్ని వెదజల్లుతుంటాడు. అది అతనికి శాంతిని, అతని నుండి మిగతా మానవాళికి ప్రశాంతిని ఇచ్చే మార్గం అవుతుంది. తరతరాలుగా జ్ఞానుల పరంపర నుండి వచ్చిన అనేక గ్రంథాలు చేసిన పని ఇదే..దీనిని మనం కొనసాగించడమే మన చేయవలసిన అత్యుత్తమమయిన పని.

పి.శ్రీనివాస్‌ గౌడ్‌, 99494 29449

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -