నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొనడంతో శ్యామ్ రాజ్ (32) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ (WB 06B 7003) కలిగిన బెంజ్ కారు బ్రిడ్జిపై ఆగి ఉన్న శ్యామ్ రాజ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో కారు ఇంజన్ భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కారును కొంత దూరం తీసుకెళ్లి అదే కేబుల్ బ్రిడ్జిపై పార్క్ చేసి, డ్రైవర్తో పాటు మరో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం సమయంలో కారులో ఇద్దరు ఉన్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.



