నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు బుధవారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కమిషన్ను ఏర్పాటు చేస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో ఆరును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి టిహరీశ్రావు, ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్కె జోషి వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విని మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత ఈనెల ఎనిమిదిన తీర్పు ప్రకటిస్తామని తెలిపినా, తీర్పు సిద్ధం కాకపోవడంతో విచారణను ఈనెల 22కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
టెస్కో ద్వారానే చేనేత వస్త్రాలు కొనాలి : హైకోర్టు
గురుకుల విద్యాసంస్థలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు చేనేత వస్త్రాల కొనుగోళ్లను తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారానే జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టెస్కో సరుకు అందించలేమని అధికారిక ధ్రువీకరణ ఇచ్చిన తర్వాతే ఇతర మార్గాల్లో కొనుగోలు చేయొచ్చని కోర్టు పేర్కొంది. ఈ ధ్రువీకరణ లేకుండా గురుకుల పాఠశాలల అవసరాల కోసం కార్పెట్లు, దుస్తులు, టవల్స్, బ్లాంకెట్లు కొనుగోలు చేయాలంటూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఈనెల రెండున విడుదల చేసిన ఈ-టెండర్ ప్రకటనను కోర్టు చెల్లదని ప్రకటించింది. టెస్కోకు ఇప్పటికే ఇచ్చిన సరఫరా ఆర్డర్ను రద్దు చేయడం కూడా న్యాయసమ్మతం కాదని తేల్చింది. వరంగల్ జిల్లా కొత్వాడకు చెందిన వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్కుమార్ మంగళవారం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించారు. తెలంగాణలో చేనేత రంగం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో సుమారు 17 వేలకుపైగా హ్యాండ్లూమ్లు ఉండగా, దాదాపు 40 వేల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడుతున్నాయని కోర్టు గుర్తించింది. చేనేత రంగం సంక్షోభంతో ఆత్మహత్యల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం 2024లో జీవో ఒకటిని ప్రవేశపెట్టిందని వివరించింది.
జీవోలోని నిబంధనలను పక్కనబెట్టడం ద్వారా దాని ఉద్దేశ్యమే దెబ్బతింటుందనీ, అధికారులకు అలాంటి స్వేచ్ఛ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ఆస్పత్రులు తమ చేనేత అవసరాలను టెస్కో లేదా అర్హత కలిగిన ఇతర సంఘాల నుంచే పొందాలని జీవోలో స్పష్టంగా ఉన్నదని పేర్కొంది. టెస్కో సరఫరా చేయలేమని తెలిపిన సందర్భంలోనే ఇతర సంస్థల నుంచి కొనుగోళ్లు జరగాలని తెలిపింది. జీవో 17 ద్వారా ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ జీవో ఒకటిని అతిక్రమించలేదనీ, రెండింటినీ కలిపి అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. టెస్కో నుంచి సరఫరా అసాధ్యమని లేఖ లేకుండానే జారీ చేసిన ఈ-టెండర్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే టెస్కో పరిధిలోకి రాని ఇతర వస్తువుల కొనుగోళ్లకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కావని తెలిపింది.
రోహిత్రెడ్డి బెయిల్ కేసు 28కి వాయిదా
మొయినాబాద్లో నమోదైన డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కె సుజన మంగళవారం ఆదేశాలను జారీ చేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యిందనీ, తన క్లయింట్ మార్చి 15 నుంచి జైలులో ఉన్నారని లాయర్ హైకోర్టుకు తెలిపారు. మొత్తం 11 మంది నిందితులు ఉన్నప్పటికీ ముగ్గురినే నిర్బంధించి, మిగిలిన వారిపై కేవలం నోటీసులతో సరిపెట్టారని వివరించారు. ఈ కేసు రాజకీయ ఉద్దేశాలతో నమోదు చేశారని ఆరోపించారు. పోలీసుల వాంగ్మూలాలు ఒత్తిడితో తీసుకున్నవని పేర్కొన్నారు. ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ నిందితుడు ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీల నిర్వహణతోపాటు సరఫరాలో కూడా పాల్గొన్నాడని తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈనెల 28వ తేదీకి వాయిదా వేశారు.
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కేసుల వివరాలు ఇవ్వండి
సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హుజూరాబాద్, వీణవంక పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కె సుజన మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టివి రమణరావు వాదిస్తూ, జాతరకు కుటుంబ సభ్యులతో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు స్పందిస్తూ ఈ కేసుల దర్యాప్తు సీఐడీకి అప్పగించబడిందని వివరించారు. దర్యాప్తు ప్రస్తుత స్థితిని తెలియజేయడానికి కొంత సమయం కావాలని కోరగా, కోర్టు వారం రోజుల గడువు మంజూరు చేసి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
కాళేశ్వరం కమిషన్పై నేడు హైకోర్టు తీర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



