- Advertisement -
నవతెలంగాణ-మునిపల్లి: భూ రీసర్వేలో భాగంగా మండలంలోని హైద్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వేను సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ సంగీత లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా పరికరాల సహాయంతో భూములను కొలుస్తున్న విధానం, హద్దులను గుర్తిస్తున్న ప్రక్రియను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ విస్తీర్ణం, హద్దులు, స్థానాన్ని ఖచ్చితంగా గుర్తించి, వాటిని సంబంధిత భూ రికార్డులతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైద్లాపూర్ గ్రామంలొ మొత్తం 575 ఎకరాలు ఉండగా ఇందులో 405 ఎకరాలు పూర్తి అయినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ముఖ్యంగా ప్రతి భూ యజమానికి సంబంధించిన భూమి హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుబాటులో ఉన్న రికార్డులతో సరిపోల్చాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. సర్వేలో ఎలాంటి జాప్యం లేకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు. భవిష్యత్లో భూ వివాదాలకు అవకాశం లేకుండా రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి నూతన భవనానికి నిధులు కావడంతో భవనం పూర్తి అయ్యే వరకు ఎక్కడ కార్యాలకలాపాలు కొనసాగిస్తే బాగుంటుంది..ఏదైనా కార్యాలయం ఖాళీగా ఉందా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఏడీ అనీష్, డీఐఓ రాజు, మునిపల్లి తహసీల్దార్ రంగారావు, జీపీఓ, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.
- Advertisement -



