నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్, గచ్చిబౌలి పరిధిలోని గోపన్పల్లిలో ఓ నాలుగంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉండటంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
గోపన్పల్లిలో కేవలం 50 గజాల స్థలంలోనే ఈ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఈ కట్టడం ఒక్కసారిగా ఒకవైపునకు ఒరిగిపోయింది. సమాచారం అందిన వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
భవనం కూలిపోయే ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు దానిని కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనతో గోపన్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ఇళ్లపై భవనం కూలితే పెను ప్రమాదం సంభవిస్తుందని చుట్టుపక్కల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



