నవతెలంగాణ-ఆలేరుటౌన్
విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు మంజూరీలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతి కుమార్ విమర్శించారు. ఆలేరు మున్సిపల్ కేంద్రంలో శనివారం ఏఐఎస్ఎఫ్ మండల మహాసభను రాష్ట్ర నాయకులు కందుల మధు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారనీ, తక్షణమే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.
వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను మొత్తం ఒకేసారి విడుదల చేయాలనీ, లేనిపక్షంలో మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 26న ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను, యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగవ మహాసభ జయప్రదం చేయుట కొరకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
మండలాధ్యక్షులుగా సాయినాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉదయ్ చరణ్, ప్రధాన కార్యదర్శిగా చండీశ్వర్, ఉపాధ్యక్షులుగా సోమనాథ్, అభి సహాయ కార్య దర్శులుగా దినేష్, సాయికిరణ్ కోశాధికారిగా వెంకట్ సూర్య ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



