నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో జాతీయ భద్రతాపై కేంద్రం ఆదేశాలతో భద్రతా బలగాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. దేశంలో ఉంటూ పాక్ దేశానికి గూఢచార్యమందిస్తున్న గుంటనక్కల కోసం దేశవ్యాప్తంగా జల్లెడ పడుతున్నాయి సెర్చ్ ఆపరేషన్ బలగాలు. ఇప్పటికే జ్యోతి మల్హాత్రాతో పాటు పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరి విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పంజాబ్లో మరో గుంటనక్కను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ టైంలో ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి చేరవేసిన గగన్దీప్ సింగ్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతని నుంచి ఫోనును స్వాధీనం చేసుకున్నారు. తర్న్ తరన్లోని మొహల్లా రోడుపూర్లో నివసిస్తున్న గగన్దీప్ సింగ్.. గత ఐదేండ్లుగా పాకిస్తాన్లోని ఖలిస్తానీ టెర్రరిస్ట్ గోపాల్ సింగ్ చావ్లాతో టచ్లో ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
గగన్దీప్ సింగ్ ఫోన్ స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. మన సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ కు లీక్ చేసిన ఆధారాలు లభించాయన్నారు. అంతేకాకుండా అతడికి 20మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ చర్యల వల్ల జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ముమ్మరం చేశామని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. భారత ఆర్మీ దళాల ప్రణాళికలు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని గగన్దీప్ సింగ్ ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామన్నారు. దానికి అతను ఐఎస్ఐ నుంచి డబ్బుకూడా తీసుకున్నాడని చెప్పారు.