ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు.. తడీ పొడి కాలంలో చెమటలు పోయటం.. చినుకుల్లో తడవటం సర్వసాధారణం. చీదర పెడుతూ.. చిరాకు పుడుతూ.. చర్మ సమస్యలతో మహిళలు స్కిన్ స్పెషలిస్టులను ఆశ్రయించటమూ సహజమే. చర్మ వ్యాధులతో కొందరు.. సౌందర్యం కోసం మరికొందరు డాక్టర్లను సంప్రదిస్తుంటారు. సన్స్క్రీన్ వినియోగం, మాయిశ్చరైజర్స్, లోషన్స్ వాడకంపై తమ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. వాతావరణ మార్పులతో క్రిమీకీటకాల వ్యాప్తి కూడా అధికమైంది. అవి కుడుతున్న చోట దద్దుర్లు వస్తున్నాయి. గోకటంతో బిందులు ఏర్పడతాయి. దాంతో చర్మం ఎర్రబారుతోంది. నీటిలో ఉండే వైరస్, మట్టిలో ఉండే సూక్ష్మక్రీములతోనూ చర్మ సంబంధిత జబ్బులు వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని రకాల పురుగులు కుట్టిన చోట చర్మంపై లోతుగా కురుపులవు తున్నాయి. ఇవి ఇన్ఫెక్షన్కు దారితీస్తున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా స్త్రీలు చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చర్మ సౌందర్యం, వ్యాధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఖమ్మంలోని ప్రముఖ డెర్మటాలజిస్ట్, ఎండీ, డాక్టర్ కందుల రాధికారాణి ‘మానవి’కి ఇలా వివరించారు.
చిత్తడి ప్రదేశాల్లో పని చేసే వ్యవసాయ కూలీల కాళ్లు, చేతుల వేళ్ల మధ్య ఫంగస్ వ్యాప్తి చెందుతోంది. కాస్త నిర్లక్ష్యం చేస్తే ఆ భాగంలో చీము పడుతోంది. రుతుక్రమంలో న్యాప్కిన్స్ వినియోగంలోనూ కొందరు పరిశుభ్రతను విస్మరిస్తున్నారు. రక్తస్రావాన్ని బట్టి సకాలంలో ప్యాడ్స్ మార్చకపోవడంతో అలర్జీ వంటివి వస్తున్నాయి. తినే ఆహారంలో లోటుపాట్లు, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గటం, రోగ నిరోధక శక్తి మందగించటం వంటివి కూడా చర్మ వ్యాధుల తీవ్రత పెంచుతున్నాయి.
శుభ్రతతోనే చర్మ వ్యాధులు దూరం..
తడీ పొడి వాతావరణంతో చర్మ సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తేమ కారణంగా ఎక్కువగా చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షంలో తడవటం, వెంటనే ఆ దుస్తులను మార్చకపోవడంతో తామర, గజ్జి, అలర్జీల వంటివి వస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో రాత్రిపూట పురుగులు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్సెక్ట్ బైట్స్ కూడా అధికమయ్యాయి. కీటకాలు కుట్టడం వల్ల చర్మం ఎర్రగా కందిపోతుంది. పురుగులు పాకడంతో దద్దుర్లు, బిందులు వస్తున్నాయి. సమ్మర్ సీజన్ అయిపోయిందిగా అని సన్స్క్రీన్, మాయిశ్చరైజర్ వినియోగం మానొద్దు. తేమతో పాటు యూవీ రేస్ ఇప్పటికీ కొంత ఎక్కువగానే ఉంటాయి కాబట్టి సన్స్క్రీన్ అప్లికేషన్ ఉండాల్సిందే. శ్రామిక మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తుంటారు. వారికి కాళ్లు, చేతుల వేళ్ల మధ్యభాగం చెడిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే తడిసిన దుస్తులు వెంటనే మార్చుకోవాలి. పొడిగా ఉండే వదులు దుస్తులు ధరించాలి. సబ్బులు, టవల్స్ కూడా ఒకరివి ఇంకొకరు వాడొద్దు. ఇండ్లు, బురదలో పనిచేసే మహిళలు పనులు పూర్తయ్యాక కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకుంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మాయిశ్చరైజర్ అందుబాటులో లేకుంటే కొబ్బరి నూనె రాసినా ప్రయోజనం ఉంటుంది.
వీరు మరింత జాగ్రత్తగా…
వృద్ధులు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. పిల్లలు కీటకాలు, దోమల బారిన పడకుండా కూడా తగు చర్యలు చేపట్టాలి. చర్మంపై అర్టికేరియా (దద్దుర్లు) వంటివి వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఇమ్యునిటీ ఎక్కువగా ఉండే మాయిశ్చరైజర్స్ ఉపయోగించాలి. యాంటి ఆక్సిడెంట్స్ న్యూట్రియన్ ఫుడ్ తీసుకోవాలి. ఉడకబెట్టకుండా సహజంగా లభించే పండ్ల వంటివి జ్యూస్ లాగా కాకుండా నేరుగా తీసుకోవాలి. పోషక విలువలున్న విత్తనాలు, ఎగ్స్ కూడా ఎక్కువగా తినాలి. గోరు వెచ్చని నీటితో స్నానం, నిల్వ చేసినవి కాకుండా వేడి ఆహారం తీసుకోవటం చర్మానికి మంచిది. దోమల వంటివి వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. డెంగ్యూ జోన్ ప్రాంతాల్లో జ్వరంతో పాటు దద్దుర్లు ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి. పిల్లల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. హాస్టల్స్లో ఉండే వారు మెరుగైన జాగ్రత్తలు పాటించాలి.
ప్రస్తుత సీజన్లో చర్మ సౌందర్యం కోసం…
ప్రస్తుత సమయంలో చర్మ సౌందర్యానికి లైట్గా ఉండే జెల్బేస్డ్ సన్స్క్రీన్లు, మాయిశ్చరైజర్స్ వినియోగించాలి. హెవీ మేకప్స్ తగ్గించుకొని వాటర్ ప్రూప్ సన్స్క్రీన్లు వాడాలి. ఇంటికి రావటంతోనే మేకప్ను తొలగించి మాయిశ్చరైజర్ను అప్లై చేసుకుంటే స్కిన్ బాగుంటుంది. అలర్జీ ఉన్నవాళ్లు రెయిన్కోట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పొడిగా ఉన్న షూస్నే ధరించాలి. రుతుస్రావాన్ని బట్టి ప్యాడ్లు మార్చాలి. లేదంటే ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తడీ పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చర్మం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఒక్కోసారి పెను సమస్యలు కూడా పరిణమించవచ్చు.