పచ్చని ప్రకృతికి నిలయమైన మణిపూర్ ఇప్పుడు నిరంతరం రగిలే జ్వాలా మారిపోయింది. పాలకుల అధికార దాహానికి బలైపోతున్నది. తెగల మధ్య విభేదాల సృష్టితో అట్టుడికిపోతున్నది. మహిళలును నగ్నంగా ఊరేగిస్తున్నారు. అలాంటి చోట ఓ మహిళ అద్భుతమైన చిత్రాలను నిర్మిస్తూ మరుగున పడిన జీవితాలను వెలుగులోకి తెస్తోంది. ఆమే డాక్టర్ మీనా లాంగ్జామ్. ఇటీవలె తాను నిర్మించిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ప్రత్యేక ప్రదర్శన కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె గురించి మరిన్ని విశేషాలు నేటి మానవిలో…
డాక్టర్ మీనా లాంగ్జామ్ తన చదువు పూర్తి చేసిన తర్వాత వృత్తి జీవితాన్ని పాత్రికేయురాలిగా ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో దాదాపు ఆరు సంవత్సరాల పాటు సీనియర్ సబ్-ఎడిటర్గా పనిచేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న ఆమె, మణిపూర్ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రింట్ జర్నలిజం పునాదులు, మీడియా రైటింగ్, విజువల్ కమ్యూనికేషన్ బోధిస్తున్నారు. మణిపూర్ యూనివర్సిటీలో ఆమె ‘మణిపూర్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, సాంప్రదాయ మీడియా ద్వారా సామాజిక అభివృద్ధి (శుమంగ్ లీల)’ అనే అంశంపై తన పీహెచ్డీని పూర్తి చేశారు. ఆమె ఎంఎఫ్డీసీ నిర్వహించిన, అలెగ్జాండ్రా వీట్స్ ‘రీ:ప్లే 12’ అనే స్క్రీన్రైటింగ్ వర్క్షాప్లో పాల్గొన్నారు. డాక్టర్ మీనా లాంగ్జామ్ జాతీయ అవార్డు గెలుచుకున్న ‘ఆటోడ్రైవర్’ అనే డాక్యుమెంటరీ రూపొందించారు.
అంతర్జాతీయ మీడియా సదస్సులో
జనవరి 2019లో FTII, పూణే వారి చొరవతో FTII, పూణే, మణిపూర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఐదు రోజుల ‘ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్సు’లో పాల్గొన్నారు. దుబాయ్లోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన ‘స్థానిక – ప్రపంచీకరణ మధ్య: సమకాలీన సినిమాలో ప్రధాన స్రవంతి, అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం’ అనే అంతర్జాతీయ మీడియా సదస్సులో, ఏప్రిల్ 25, 2019న ‘బాలీవుడ్లో ఈశాన్య భారతదేశ ప్రతీకాత్మక నిర్మూలన’ అనే పత్రాన్ని సహ-సమర్పించారు. అలాగే నవంబర్ 2019లో FTII, పూణే వారి చొరవతో FTII, పూణే, మణిపూర్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన 15 రోజుల ‘స్మార్ట్ఫోన్ ఫిల్మ్మేకింగ్ వర్క్షాప్’లో పాల్గొన్నారు. ఓ స్వతంత్ర చిత్రనిర్మాతగా తాను నిర్మించిన చిత్రాలకు ఎన్నో ప్రశంసలు పొందిన విద్యావేత్త. అంతేకాదు మణిపూర్ నుండి జాతీయ అవార్డు అందుకున్న మొట్ట మొదటి మహిళా చిత్రనిర్మాత. ఆమె తన తొలి డాక్యుమెంటరీ ‘ఆటోడ్రైవర్’కు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
సామాజిక, లింగ సమస్యలపై
ఓ తల్లిగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన బాధ్యతలు సమతుల్యం చేసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు. అలాగే 2015లో ‘ఎయిరమీన్ మీడియా’ను స్థాపించారు. ఇది సామాజిక, లింగ సమస్యలపై చిత్రాలను నిర్మించడానికి, అలాగే మీడియా, కళలపై రచనలను ప్రచురించడానికి అంకితమైన ఒక వేదిక. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘ఆటోడ్రైవర్’, సంఘర్షణలతో ప్రభావితమైన ఇంఫాల్లో రోజువారీ వివక్షను ఎదుర్కొంటున్న ఒక మహిళా ఆటో డ్రైవర్ దృఢమైన జీవితాన్ని ఈ చిత్రంలో చిత్రీకరిస్తుంది.
మణిపురి మహిళల శక్తి
ఆటో డ్రైవర్ చిత్రం 2015లో కేరళలోని సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అక్కడ ఇది జ్యూరీ మెన్షన్ స్పెషల్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వుడ్పెక్కర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా జ్యూరీ స్పెషల్ మెన్షన్ను పొందింది. అప్పటి నుండి ఇది అనేక జాతీయ, అంతర్జాతీయ ఉత్సవాలలో ప్రదర్శించబడింది,. సమాజంలో మణిపురి మహిళల ఉత్సాహభరితమైన పాత్రను ఇది చాటింది. మీనా చిత్రాలు మొదటి నుండి దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందుతూనే ఉన్నాయి. ఆమె లఘు చిత్రం ‘ఎకో’ 2016లో పీస్ బిల్డర్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత ‘అచౌబి ఇన్ లవ్’ 2019లో కాఠ్మండులోని ఫిల్మ్ సౌత్ ఆసియాలో ప్రదర్శించబడింది. ఇటీవలే ఆమె పూర్తి నిడివి డాక్యుమెంటరీ ‘ఆండ్రో డ్రీమ్స్’ 2023లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో నాన్-ఫీచర్ విభాగాన్ని ప్రారంభించింది.
ఆండ్రో డ్రీమ్స్
మీనా నిర్మించిన ఆండ్రో డ్రీమ్స్లోకి వెళితే మణిపూర్లోని ఆండ్రో గ్రామానికి చెందిన 66 ఏండ్ల లైబీ అనే మహిళ, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల ఫుట్బాల్కు అందించిన ప్రోత్సాహం, ఆమె ప్రయాణం చుట్టూ ఈ డాక్యుమెంటరీ కథ సాగుతుంది. ఈ సినిమా ద్వారా మహిళల సంకల్పం, క్రీడల పట్ల వారి ఆసక్తి, సామాజిక మార్పు వంటి అంశాలను దర్శకురాలు ఆవిష్కరించారు. ‘ఆండ్రో డ్రీమ్స్’ చూస్తున్నప్పుడు తెరపై కనిపించేది లైబీ, ఆ అమ్మాయిల ఫుట్బాల్ మాత్రమే. కానీ ఆ దృశ్యాల వెనుక దర్శకురాలు మీనా లాంగ్జామ్ చేసిన ఏండ్ల శ్రమ, ఆ గ్రామంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధం కనిపించదు.
వారి జీవితంలో ఓ భాగమై…
మణిపూర్లోని మారుమూల గ్రామమైన ఆండ్రో గురించి చెప్పాలంటే అక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ రైస్ బీర్ తయారీ కూడా గుర్తుకొస్తుంది. అయితే ఆండ్రోను కేవలం ఆ సంప్రదాయంతోనే గుర్తించే దృష్టికోణాన్ని మార్చి, అక్కడి మహిళల ధైర్యం, ప్రతిభ, కలలను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ప్రయత్నం ఈ సినిమా ద్వారా మీనా చేశారు. లైబీ కథను తెలుసుకున్న తర్వాత ఆమె కేవలం ఒక డాక్యుమెంటరీ తీయాలని అనుకోలేదు. లైబీతో, ఆ అమ్మాయిలతో కలిసి జీవిస్తూ వారి జీవితాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. తెల్లవారుజామున 5 గంటలకే లేచి వారి రోజును గమనించడం, వారితో కలిసి భోజనం చేయడం, వారి ఇళ్లలో ఉండడం, రోజులు, రాత్రులు వారితో గడపడం.. ఇలా కెమెరా వెనుక కూడా వారి జీవితంలో ఒక భాగంగా మారారు.
పోరాడే అమ్మాయిలు
డాక్యుమెంటరీ చిత్రీకరణలో ముఖ్యమైనది కెమెరా పెట్టడం కాదు, మనుషుల నమ్మకాన్ని సంపాదించడం అని మీనా అంటారు. లైబీతో ఆమెకు ఏర్పడిన బంధం కూడా సినిమా పూర్తయిన తర్వాత ముగియలేదు. ఇప్పటికీ ఆమెతోనూ, ఆ అమ్మాయిలతోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఆ అనుబంధమే ‘ఆండ్రో డ్రీమ్స్’లో కనిపించే సహజత్వానికి ప్రధాన కారణం. మణిపూర్ను తరచుగా సంఘర్షణలు, సమస్యల కోణంలోనే చూస్తుంటాం. కానీ మీనా లాంగ్జామ్ ప్రయత్నం దానికి భిన్నమైన మణిపూర్ను చూపించడం తమ పరిస్థితులను దాటి పెద్ద కలలు కనగలిగే మహిళలను, ఆ కలలను సాకారం చేయడానికి పోరాడే అమ్మాయిలను చూపించడం.
ప్రపంచ ప్రేక్షకుల ముందుకు
లైబీ ఒక అమ్మాయిగా పుట్టినందుకు తిరస్కరించబడిన కుటుంబం నుంచి వచ్చి, తన జీవితాన్ని పెండ్లికి కాకుండా అమ్మాయిల ఫుట్బాల్ కోసం అంకితం చేసుకున్నారు. ఆమె ధైర్యం, పట్టుదల మీనాను ఈ కథను ప్రపంచానికి చెప్పేలా చేశాయి. ఒక చిన్న వార్తా కథనంగా మొదలైన లైబీ కథ, మీనా కెమెరా ద్వారా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా మీనా ప్రయాణం ఆగలేదు. దేశంలోని ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్తో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ‘ఆండ్రో డ్రీమ్స్’ను తీసుకెళ్లేందుకు ఆమె నిరంతరం ప్రయత్నిస్తున్నారు. IFFIలో ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ విభాగానికి ఈ చిత్రం ప్రారంభ చిత్రంగా నిలిచింది. కేరళ, కొరియా, ఈజిప్ట్, ఇరాన్ వంటి అంతర్జాతీయ వేదికలకూ చేరింది.
సలీమా
వాస్తవ జీవితాలే ఆమె సినిమాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


