– లేబర్ కోడ్స్ అమలును నిలిపివేయండి : సీపీఐ(ఎం) ఏపీ డిమాండ్
అమరావతి: పనిగంటలు పెంచుతూ రాష్ట్రమంత్రిమండలి తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని సిపిఎం రాష్ట్రకమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా జులై 9న యావత్ కార్మికవర్గం దేశవ్యాప్తంగా సమ్మెకు సన్నద్దమవుతున్న దశలో రాష్ట్రమంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తునట్లు తెలిపారు., కార్మికసంక్షేమం దృష్టా లేబర్ కోడ్స్ అమలును రాష్ట్రంలో నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. 8 గంటల పనికోసం పోరాడి సాధించుకున్న కార్మికవర్గంపై 12 గంటల పనిని రుద్దుతూ రాష్ట్రప్రభుత్వం నిరణయం తీసుకోవడాన్ని ప్రజావ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. కార్మికుల రక్తమాంసాలు పిండి కార్పొరేట్లకు ఇబ్బడిముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో, ఏఐ విస్తరించి మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పనిగంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమని అన్నారు. పైగా కనీస వేతనాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధపడలేదని తెలిపారు. ఒకవైపు ధరలు పెరిగి శ్రామికుల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని,కొనుగోలు శక్తి తగ్గి ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ స్థితిలో పనిగంటలు తగ్గించి అదనపు ఉపాధిని కల్పించాల్సిందిపోయి నిరుద్యోగాన్ని పెంచే ఈ చర్య అభివృద్ధి నిరోధకమైందని పేర్కొన్నారు. తక్షణం లేబర్ కోడ్స్ను, దాని అనుబంధ రూల్స్ను ఉపసంహరించుకోవాలని కోరారు. లేబర్: కోడ్స్కు వ్యతిరేకంగా జులై 9న జరగనున్న జాతీయ సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. యావత్ కార్మికవర్గం ఐక్యంగా ఈ దాడిని ప్రతిఘటించాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు నష్టదాయకం: సిఐటియు
కార్మిక వర్గానికి నష్టదాయకంగా కార్మిక చట్టాలను మారుస్తూ రాష్ట్రమంత్రిమండలి నిర్ణయం తీసుకుందని సిఐటియు పేర్కొంది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్పులను ఉపసంహరించుకోవాలని యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏవి నాగేశ్వరరావు, సిహెచ్ నర్సింగరావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్న షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్లో 13 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగలేదని, కనీస వేతనాల బోర్డును నియమించలేదని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు పథకాలను పునరుద్ధరించలేదని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమానవేతనం అమలు చేయడం లేదని వారు తెలిపారు. వీటి అమలుపై నోరు మెదపని చంద్రబాబు న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికి తహతహలాడుతోందని పేర్కొన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త లేబర్కోడ్స్ను తెచ్చి, కార్మికవర్గం హక్కులను హరించాలని చూస్తున్న బిజెపి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. .కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిగంటలు, ఓటి కాలాన్ని నిర్ణయించడం, సాధికారిత పేరుతో రక్షణ కల్పించకుండా మహిళల చేత రాత్రిపూట పనిచేయించాలనడం దుర్మార్గవని పేర్కొన్నారు. కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే పెరిగిన ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనాల సవరణ వెంటనే చేయాలని, మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
దుర్మార్గం: శ్రామిక మహిళా రాష్ట్రసమన్వయ కమిటీ
మహిళా సాధికారత పేరుతో మహిళలకు నైట్ డ్యూటీలు చేయించాలనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయం దుర్మార్గమని,దీనిని ఖండిస్తున్నట్లు శ్రామిక మహిళా రాష్ట్రసమన్వయ కమిటీ తెలిపింది. పట్టపగలే మహిళలకు రక్షణ లేదని, అత్యాచారాలు, హత్యలు,దాడులు మహిళలపై పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం ఇలాంటి నిర్ణయం చేయడం సబబుకాదని కమిటీ కన్వీనర్ కె ధనలక్ష్మీ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది మహిళా సాధికారత కాదని, మహిళా విఘాతం అని తెలిపారు. ఇప్పటికే భద్రత లేని ఉద్యోగాల్లో నియమించబడ్డ శ్రామిక మహిళలు కనీస వేతనాలు, పనిభద్రత, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు, మంచినీళ్లు వంటి సౌకర్యాల కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం చేసిన నిర్ణయం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఉందని మండిపడ్డారు. నైట్ డ్యూటీలు చేయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయాన్ని కార్మికవర్గం, శ్రామిక మహిళలు తిప్పికొట్టాలని కోరారు.
శరాఘాతం: ఎస్డబ్ల్యూఎఫ్
రాష్ట్రప్రభుత్వ నిర్ణయం ఉద్యోగ, కార్మికుల పాలిట శరాఘాతమని ఆర్టీసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ విమర్శించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ బాటలోనే రాష్ట్రప్రభుత్వం కూడా కార్మిక హక్కులపై దాడి చేస్తూ క్యాబినేట్లో నిర్ణయం చేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలకు నైట్ డ్యూటీలు ఆర్టీసి వంటి రంగాల్లో పనిచేస్తున్న వారికి పెద్దముప్పు వంటిదని పేర్కొంది.